కేసీఆర్ బాటలో బాబు

తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సాగబోతున్నారా? కేసీఆర్ లాగే రెండు చోట్ల పోటీ చేసేందుకు బాబు ఆలోచిస్తున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో బాబు రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం టీడీపీకి అత్యవసరం. అందుకోసం చంద్రబాబు ప్రణాళికలు, కసరత్తుల్లో మునిగిపోయారు. పార్టీని తిరిగి అధికారంలోకి తేవడం కోసం కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత నియోజకవర్గం కుప్పంపైనా ఫోకస్ పెట్టారు. మరోవైపు కుప్పంలో చంద్రబాబును ఓడించి టీడీపీని చావుదెబ్బ కొట్టాలనే పట్టుదలతో అధికార వైసీపీ ఉంది. ఆ బాధ్యతలను ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించారు. చిత్తూరు జిల్లా ఇంచార్జీగా పెద్దిరెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక కుప్పం ఇంచార్జీగా భరత్ కూడా జోరుమీదున్నారు. స్థానిక ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ హవా చూపిన సంగతి తెలిసిందే.

మరోవైపు కుప్పంలో ఓట్లను భారీ సంఖ్యలో పీకేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎక్కడో స్థిరపడి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే జనాలను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఓట్లను తొలగిస్తున్న నియోజకవర్గాల్లో కుప్పం కూడా ఒకటి. ఇవన్నీ టీడీపీకి అనుకూలంగా ఉండే ఓట్లేననే ఆరోపణలున్నాయి. అందుకే టీడీపీకి పడే ఓట్లను తొలగిస్తుండడంతో బాబు ఆలోచనలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా వచ్చే ఎన్నికల్లో కుప్పంతో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం.