లోకేష్ పై పోటీకి ఆ ముగ్గురిలో ఒకరు

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని మళ్లీ గెలిపించుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారీగా సమీక్షలు, అభ్యర్థుల ఎంపికపై సూచనలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా అంతే సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో మరోసారి లోకేష్ ను ఓడించి టీడీపీని, బాబును దెబ్బకొట్టాలనే జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్.

2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచే లోకేష్ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కానీ ఈ సారి ఆయనకు పోటీగా నిలబడే వైసీపీ అభ్యర్థి మారే అవకాశముందని సమాచారం. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డిపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తుందని టాక్. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం కూడా ఆళ్లపై గుర్రుగా ఉందని తెలిసింది. సర్వేల్లోనూ ఆళ్ల వెనుకబడ్డారని జగన్ కు సమాచారం అందిందని చెబుతున్నారు.

అందుకే వచ్చే సారి మంగళగిరిలో లోకేష్ కు పోటీగా దింపే అభ్యర్థి కోసం జగన్ వేట మొదలెట్టారని టాక్. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల్లో ఒకరిని మంగళగిరిలో బరిలో దించేందుకు జగన్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మరి ఈ ముగ్గురిలో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి మరోవైపు ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో పార్టీని పటిష్ఠం చేసే బాధ్యతలను ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు చంద్ర బాబు అప్పగించారు. మరి మంగళగిరి పై జగన్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో లోకేష్ విజయం కోసం ఆమె ఎలాంటి కసరత్తులు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.