టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఆ ఎంపీ?

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరపున గెలిచింది ముగ్గురు ఎంపీలు మాత్రమే. అందులో ఒకరు కేశినేని నాని. అయితే గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన బాబుపై, టీడీపీపై పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా వైఖరి చూస్తుంటే టీడీపీ వీడేందుకు సిద్ధమైనట్లే కనిపిస్తున్నారని టాక్.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో సాగితే అక్కడే సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నాని హాజరు కాకవపోడం చర్చనీయాంశంగా మారింది. పాదయాత్రకు ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు. మరోవైపు తాజాగా కేంద్ర ప్రభుత్వ స్పూర్తి పథకం ఎంపీలాడ్స్ నిధులతో కొండపల్లి బొమ్మల తయారీ, విక్రయ భవన సముదాయం నిర్మించారు. దీన్ని కేశినేని నాని ప్రారంభిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో ఎక్కడా కూడా టీడీపీ అనే పేరు లేకుండా నాని జాగ్రత్త పడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరోవైపు కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి విజయవాడ లోక్ సభ సీటు ఇచ్చేందుకు బాబు సిద్ధమయ్యారనే టాక్ ఉంది. అందుకే చిన్నిని బాబు తెగ ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రలోనూ ఆయన దగ్గరుండి మరీ అన్ని చూసుకున్నారు. ఇది రుచించని కేశినేని నాని టీడీపీకి ఇంకా దూరమయ్యారు. ఈ పరిణామాలు అన్ని చూసిన తర్వాత నాని పార్టీ వీడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.