ఎన్నికలపుడే సంక్షేమమా ?

ఎన్నికలు ఉపఎన్నికలు కావచ్చు లేదా జనరల్ ఎలక్షన్స్ కావచ్చు ఏదైనా వస్తోందంటేనే కేసీయార్ కు సంక్షేమపథకాలు గుర్తుకొచ్చేట్లున్నాయి. ఇపుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం, రైతురుణమాఫీ, బీసీ ఫెడరేషన్లకు నిధులంటు కేసీయార్ ఇపుడు నానా గోల చేస్తున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే రేపటి ఎన్నికల్లో గెలుపుకోసమే కేసీయార్ రైతురుణమాఫీని అమలుచేస్తున్నారు. నాలుగున్నరేళ్ళుగా అసలు రుణమాఫీ గురించి పట్టించుకోనేలేదు. ఎంతమంది రైతులు ఎంత గోలచేసినా కేసీయార్ పట్టించుకోలేదు.

అలాంటిది రైతులు కూడా ఆశ్చర్యపోయేట్లుగా రుణమాఫీపై కేసీయార్ జోరుపెంచారు. ఆదాయార్జన శాఖల నెత్తిన కూర్చుని సెప్టెంబర్ 2వ వారంలోగా రుణమాఫీ మొత్తం అయిపోవాల్సిందే అని ఆదేశించారు. నిధుల సమీకరణ కోసం భూములు అమ్మేశారు, కొన్ని భూములను వేలంవేశారు. మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సుల కాలపరిమితి ఇంకా ఉన్నా సడెన్ గా నాలుగు నెలల ముందే వేలంపాటలు పాడేస్తున్నారు.

ఇవన్నీ ఎందుకంటే ఆదాయం సంపాదించి రైతు రుణమాఫీని అమలు చేయటానికే. రైతు రుణమాఫీ అమలుచేయకుండా రేపు ఎన్నికలకు వెళితే ఏమవుతుందో అందరికన్నా కేసీయార్ కే బాగా తెలుసు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం కూడా. ఉద్యోగులు, కార్మికులు ఎంత మొత్తుకున్నా కేసీయార్ పట్టించుకోలేదు. అలాంటిది ఎవరూ ఊహించని విధంగా తనంతట తానుగానే ఆర్టీసీని విలీనం చేసేశారు. ఇపుడు బీసీ ఫెడరేషన్లకు నిధులు విడుదల పేరుతో హడావుడి మొదలుపెట్టారు. ఎందుకంటే బీసీ కులాలైన రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర ఫెడరేషన్లలో నిధులు లేవు.

సాయం కోసం లక్షలమంది దరఖాస్తులు చేసుకున్నా నిధులు లేక చాలామందికి సాయం అందించనేలేదు. ఒక్కో ఫెడరేషన్ నుండి 5, 10 మందికి చొప్పున సాయం అందిందంతే. వేలాదిమందికి అందాల్సిన సాయం కేవలం వేళ్ళమీద లెక్కించేంతమందికి మాత్రమే సాయం ఎందుకు అందించింది ? ఎందుకంటే అందరికీ సాయంచేయటానికి ఫెడరేషన్లలో డబ్బులు లేవుకాబట్టి. అలాంటిది ఇపుడు ఫెడరేషన్లకు నిధులంటు కేసీయార్ నానా రచ్చ చేస్తున్నారు. కారణం ఏమిటంటే రేపటి ఎన్నికల్లో ఓట్లకోసమే అని అర్ధమైపోతోంది. అంటే ఎన్నికలు వస్తేనే కేసీయార్ కు సంక్షేమం గుర్తుకొస్తోందన్న విషయం స్పష్టమవుతోంది.