అక్కడ కడియం ప్రచారం.. మరి రాజయ్య పరిస్థితి

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుతున్నట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతల మధ్యే రాజకీయ పోరు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పోరు ముదురుతుందనే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య తనకే మరోసారి టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. మరోవైపు ఈ సారి పోటీ చేసే అవకాశం వస్తే గెలిపించాలంటూ ప్రజలను కడియం కోరుతున్నారు.

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఆయన ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేయబోతున్నారని సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు కూడా టాక్. అలా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే నియోజకవర్గాల్లో స్టేషన్ ఘన్పూర్ కూడా ఉంటుందని తాజాగా కడియం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు పోటీ చేసే అవకాశం వస్తే గెలిపించాలని ఇప్పటికే కడియం ప్రచారం మొదలెట్టినట్టు కనిపిస్తున్నారు.

సర్పంచ్ వివాదం రాజయ్యపై ప్రతికూల ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీ కాకుండా కొంత కాలం నుంచి కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ రాజయ్య విమర్శలు చేస్తున్నారు. అందుకే వివాదాల్లో చిక్కుకుంటున్న రాజయ్యను కాదని ఈ సారి టికెట్ కడియం శ్రీహరికి ఇవ్వాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు టాక్. అదే జరిగితే మరి రాజయ్య పరిస్థితి ఏమిటన్నది చూడాలి.