టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఓ రేంజి ట్రోలింగ్

అసలే వర్షాలు.. ఆపై వరద.. జనమంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమను ఆదుకునే నాథుడే లేడా? అంటూ ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు ప్రభుత్వం భరోసా దక్కింది. సరే… ఈలోగా వాన తగ్గింది. రోజుల తరబడి కనిపించని సూర్యుడూ దర్శనమిచ్చాడు. సర్కారు అండతో వర్ష బీభత్సాన్ని ఎలాగైనా పూరించేసుకోవచ్చని జనం భావిస్తున్న వేళ… అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు… నెటిజన్లకు మండేలా చేసింది. ఇంకేముంది… ఆ ఎమ్మెల్యే మాడు పడిగేలా ట్రోలింగ్ మొదలైపోయింది.

భారీ వర్షాల దెబ్బకు వరంగల్ నగరం అతలాకుతలమైంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఓరుగల్లు జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. కాలనీలు చెరువులను తలపించాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నగర వాసులు విలవిల్లాడారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించారు. ఇతర మంత్రులతో కలిసి ముంపు ప్రాంతాలను సందర్శించిన కేటీఆర్.. వరంగల్‌లో ఆక్రమణలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వద్ద బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి పరిస్థితి చూసి చలించిపోయిన కేటీఆర్.. అందరికీ నిత్యావసరాలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నానని తెలిపారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘‘రాముడి రాకతో… ఉదయించిన భాస్కరుడు… అస్తమించిన వరుణుడు… Good things happen in the presence of positive people.’’ అని ఎమ్మెల్యే తన ట్విట్టర్ ఖాతాలో తనదైన శైలి స్వామి భక్తిని ప్రదర్శించారు. అప్పటికే భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులకు లోనైన జనానికి దాస్యం ట్వీట్ చిరాకు తెప్పించింది. అంతే ఇక ట్రోలింగ్ మొదలైపోయింది. ‘ఈ మూఢనమ్మకాలు వద్దు. కేటీఆర్ కష్టపడుతున్నారు.. నేను ఒప్పుకుంటా’ అని ఓ నెటిజన్ ఒకింత సంయమనంతోనే బదులిచ్చాడు. ఆ తర్వాత ‘కొద్దిగా ముందు రమ్మంటే అయిపోయేదిగా సారూ.. ఈ వరదల తిప్పుళ్లు తప్పుతుండే’ అంటూ మరో నెటిజన్ చురకలు అంటించాడు. ‘కేటీఆర్ సారు ఎప్పటికి హైదరాబాద్ లోనే ఉంటాడు కదా! మరి అక్కడ వరుణుడు ఎందుకు అస్తమించలేదు సార్???’’ అని మరో నెటిజన్ ఎమ్మెల్యేను నిలదీసేశాడు. ‘‘రెండు రోజులు వరంగల్లొనే ఉండుమను.సూర్యుడు రాత్రి పగలు ఉదయించి నీళ్లు మొత్తం ఆవిరి ఆయి నగరం శుభ్రం అవుతుంది’’ అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించాడు. మొత్తంగా కష్టాల వేళ స్వామిభక్తిని ప్రదర్శించిన దాస్యం నెటిజన్ల తీవ్రమైన ట్రోలింగ్ కు గురయ్యారు.