రిపోర్ట్ – జులైలో పోయిన ఉద్యోగాలు 50 లక్షలు !

అగ్రరాజ్యం అమెరికా మొదలు అభివృద్ధి చెందుతోన్న భారత్ వరకు కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్నాయి. కరోనా మహమ్మారి విసిరిన పంజాకు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అధ:పాతాళానికి పోయాయి. 2008 ఆర్థిక మాంద్యం కన్నా కరోనాతో రాబోతోన్న ఆర్థిక మాంద్యం ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో రాబోయే కాలంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారని చెబుతున్నారు.

ఇప్పటికే జీడీపీ పడిపోయి నానా తిప్పలు పడుతోన్న భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా పెను ప్రభావం చూపిందని చెబుతున్నారు. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు ఈ ఏడాది మొత్తం కొనసాగుతాయని అంటున్నారు. ఇక, కరోనాతో అనివార్యమైన లాక్ డౌన్ వల్ల ఒక్క జులై నెలలోనే దాదాపు 50లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తాజా నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు భారత్ లో దాదాపు 1.8 కోట్ల మది ఉద్యోగాలు కోల్పోయారని సీఎంఐఈ ప్రకటించింది.

లాక్ డౌన్ దెబ్బకు బడా కంపెనీలు మొదలు చిన్నా చితక కంపెనీల వరకు అన్నీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చాలామంది ఉద్యోగులను తొలగించాయి. చిన్నా చితకా కంపెనీలు కరోనా దెబ్బకు మూతబడ్డాయి. ఈ క్రమంలోనే గడచిన నాలుగు నెలల్లో దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని సీఎంఐఈ వెల్లడించింది. నెలసరి జీతం పొందే ఉద్యోగాలు దేశ జీడీపీకి ఊతమిస్తాయని, ఈ ఉద్యోగాల కోత జీడీపీపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది.

గ్రామీణ, నగర ఉపాధిపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది. అన్ లాకింగ్ లోనూ కొత్త నియామకాలు మందకొడిగా సాగడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వెల్లడించింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జులైలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు తమ ఖర్చులను చాలావరకు తగ్గించుకున్నారని, ఉద్యోగాల కల్పన పరిస్థితిలో మార్పు రాకుంటే ఈ ప్రభావం గ్రామీణ ఎకానమీపై పడుతుందని హెచ్చరించింది. నెలసరి జీతాలిచ్చే ఉద్యోగాల కల్పనలో వృద్ధి లేకుంటే ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుందని వార్నింగ్ ఇచ్చింది.