విలీనానికి షర్మిల షరతు పెట్టారా ?

కాంగ్రెస్ లో వైఎస్సార్టీపి విలీనం రెండు అడుగులు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు ఉంది. పార్టీవర్గాల తాజా సమాచారం ఏమిటంటే విలీనం చేయటానికి అంగీకరించిన షర్మిల కాంగ్రెస్ అధిష్టానం ముందు ఒక షరతు విధించారట. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఐదు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని అడిగారట. గడచిన రెండు సంవత్సరాలుగా తననే నమ్ముకుని, తనతో పాటు ప్రయాణిస్తున్న నేతల్లో కొందరికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని షర్మిల స్పష్టంగా చెప్పారట.

రెండుమూడురోజులుగా పార్టీ నేతలతో సమావేశమవుతున్న షర్మిల తనను నమ్ముకున్న వాళ్ళకి ఎట్టి పరిస్ధితుల్లోను అన్యాయం జరగదని పదేపదే హామీలిస్తున్నారు. ఆ హామీలు ఇవ్వటానికి తెరవెనుక కారణం కాంగ్రెస్ అధిష్టానం ముందుంచిన ఐదు నియోజకవర్గాల షరతే అని పార్టీవర్గాలు చెప్పాయి. అయితే ఇందుకు కాంగ్రెస్ అగ్రనేతలు అంగీకరిస్తారా లేదా అన్నది తెలీదు. ఎందుకంటే పార్టీలోనే టికెట్లకోసం కొట్టుకుపోతున్నారు. అలాంటిది ఏకంగా ఐదుసీట్లు షర్మిలకు కేటాయించటం అంటే మామూలు విషయంకాదు.

అసలు తెలంగాణా కాంగ్రెస్ లో షర్మిల చేరటమే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఏమాత్రం ఇష్టంలేదు. అయితే నిర్ణయం కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్ధాయిలో జరిగింది కాబట్టి రేవంత్ చేయగలిగేదేమీలేదు. అందుకనే షర్మిల పోటీచేయబోయేది ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నుండా లేకపోతే సికింద్రాబాద్ ఎంపీగానా అన్నదే తేలలేదు. షర్మిల విషయంలోనే ఇంకా పార్టీకి స్పష్టత లేనపుడు ఇక ఐదుమందికి టికెట్లంటే కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించటం కష్టమనే అంటున్నారు.

పరిస్ధితులన్నీ అనుకూలిస్తే మహాయితే షర్మిల కోటాలో ఎక్కడైనా ఒక టికెట్ ఇస్తే అదే చాలా ఎక్కువన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళి కేసీతో భేటీ అయిన షర్మిల విలీనానికి దాదాపు ఓకే చెప్పేశారు. సోనియా, రాహుల్, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి విలీనం ఫైనల్ చేసేస్తారట. ఇంతలోపే తన కోటా సీట్లను కూడా ఫైనల్ చేసుకోవాలని షర్మిల పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.