ఎక్కడ ఓడారో.. అక్కడే..

ఎక్కడ ఓడారో అక్కడే తమ సత్తా చాటాలనుకుంటున్నారు ఆ ఇద్దరు నేతలు. తాము ఓడిన నియోజకవర్గంలోనే పర్యటించి ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఇద్దరు ఒకరు పవన్‌ కల్యాణ్‌ కాగా.. మరొకరు నారా లోకేశ్‌. మొన్న గాజువాకలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన, నేడు మంగళగిరిలో నారా లోకేష్‌ పాదయాత్ర యాథ`చ్ఛికమే. అయినా ఈ యాత్రల మధ్య ఒక కామన్‌ విశేషం ఉంది.

2019 ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేశారు. దాదాపు 16 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన తాను ఓటమి పాలైన నియోజకవర్గంలో మూడు రోజుల కిందట పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఓడినా గాజువాక తన నియోజకవర్గం అని సగర్వంగా ప్రటించారు. అక్కడి ప్రజలు కూడా ఆయనకు నీరాజనాలు పలకడం విశేషం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జనసేన జెండా ఎగురుతుందని ఆయన ప్రకటించారు.

మరోవైపున టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం మంగళగిరిలోకి అడుగు పెట్టింది. అక్కడ ఆయనకు అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం ఎదురైంది. పైగా వందల సంఖ్యలో వైసీపీ, ఇతర పార్టీల కార్యకర్తలు టీడీపీలో చేరడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో లోకేశ్‌ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా నిరుత్సాహ పడకుండా స్థానికంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పలు సామాజిక కార్యకమ్రాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు.

ఎక్కడ పోగుట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలనేది తెలుగు సామెత. ఈ ఇద్దరూ పార్టీలు వేరైనా తాము ఓడిన నియోజకవర్గాల్లో ఈ వారంలో పర్యటన చేపట్టారు. ఆ పర్యటనల్లో భారీగా వారి వారి కార్యకర్తలు హాజరై విజయవంతం చేయడం విశేషం. గాజువాక జన సైనికులతో హోరెత్తగా.. మంగళగిరి నారా లోకేష్‌ అభిమానులతో నిండిపోయింది. ఆ అభిమానం ఓట్ల రూపంలోకి మారతాయో లేదో చూడాలి మరి..?