వారాహి యాత్ర.. వైసీపీ అటెన్షన్‌

పవన్‌ వారాహి యాత్ర అంటేనే వైసీపీ అలర్ట్‌ అవుతోంది. మొదటి, రెండో విడతల్లో గోదావరి జిల్లాలకే పరిమితం అనుకుంటే.. మూడో విడత ఉత్తరాంధ్రలో కాలు పెట్టాడు. విశాఖలో తొలిరోజు మాట్లాడుతూ తానేం మాట్లాడతానో అని చాలా కోపంగా గొంతు నులిమేద్దామని ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులకు నా నమస్కారాలు.. అంటూ తన ప్రసంగాన్ని పార్రంభించారు. అది నిజమే అంటూ జనసైనికులు తమ కేరింతలతో సమాధానమిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తన సమీప ప్రత్యర్థిని గుర్తించిందా! ఆ రాజకీయ శత్రువునే టార్గెట్‌ చేస్తోందా? జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అధికార పక్షం పై జనసేన అధినేత పవన్‌ కాలుదువ్వుతున్న వైనం, అందుకు బదులుగా జగన్‌ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. తన శత్రువుని తానే ఎంచుకోవడం అనేది రాజకీయాల్లో నయా ట్రెండ్‌. ఏపీ రాజకీయాల్లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. వారాహి యాత్ర మొదలైన తర్వాత మిగిలిన పార్టీల వాయిస్‌ అంతగా వినిపించడం లేదు. పవన్‌ వైసీపీ నేతలపై పదునైన ఆరోపణలు చేయడమే అందుకు కారణం. ఈ కారణంగానే జనసేన పతాక స్థాయి వార్తలలో ఉంటోంది.

పవన్‌ వారాహిపై నుంచి ప్రసంగించినా, రిషికొండ వెళ్లినా, పెందుర్తి వెళ్లినా.. వలంటీర్ల వ్యవస్థపై విమర్శలు గుప్పించినా.. వెంటనే నలుగురైదుగురు మంత్రులు, అధికార ప్రతినిధులు అందుకు సమాధానం ఇచ్చే పనిలో ఉంటున్నారు. కానీ పైకి మాత్రం తమ ముఖ్యమంత్రి పవన్‌ పేరు కూడా ఉచ్ఛరించడం లేదని చెబుతున్నారు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో జనసేన కోరుకున్నట్లు ద్విముఖ పోరు జరుగుతుందా..? వైసీపీ కోరుకున్నట్లు బహుముఖ పోరు జరుగుతుందో వేచి చూడాలి.