కేసీయార్ బిజీ బిజీ

రాబోయే ఎన్నికలకు సంబంధించి టికెట్లు ఫైనల్ చేయటంలో కేసీయార్ చాలా బిజీగా ఉన్నట్లున్నారు. ఎరవల్లిలోని ఫాం హౌజ్ లో కూర్చుని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గడచిన నాలుగురోజులుగా ఫాం హౌజ్ నుండి కేసీయార్ బయటకు రాలేదట. పైగా మంత్రి హరీష్ రావును రెండుసార్లు పిలిపించుకుని మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే టికెట్లు ఫైనల్ చేసే విషయంలోనే కేసీయార్ చాలా బిజీగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం మొదలయ్యేనాటికి మొదటి లిస్టును రెడీగా పెట్టుకోవాలని కేసీయార్ అనుకున్నారట.

ఈనెల 17వ తేదీ శ్రావణమాసం మొదలవుతోంది. అప్పటికి కనీసం 70 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను రెడీ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఇందులో సిట్టింగులు, ఎలాంటి వివాదాలు లేకుండా ఏక నాయకత్వం ఉన్న నియోజకవర్గాలు ఉండబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. సిట్టింగుల విషయంలోనే చాలా అయోమయం పెరిగిపోతోంది. ఎలాగంటే ఒకసారేమో సిట్టింగులందరికీ టికెట్లని కేసాయార్ ఒకసారి ప్రకటించారు. ఇంకో సందర్భంలో మాట్లాడుతు తాను చేయించుకుంటున్న సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించబోతున్నట్లు చెప్పారు.

రెండు రకాల స్టేట్మెంట్లు కేసీయార్ నుండే రావటంతో సిట్టింగ్ ఎంఎల్ఏల్లో అయోమయం పెరిగిపోతోంది. ఎన్నికలు మరో నాలుగునెలల్లోకి వచ్చేసింది. ఇపుడు కూడా సిట్టింగ్ ఎంఎల్ఏల విషయంలో కేసీయార్ క్లారిటి ఇవ్వకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఈ అయోమయానికి ఇపుడు జరుగుతున్న కసరత్తే సమాధానం చెబుతుందని పార్టీ నేతలు అనుకుంటున్నారు. టికెట్లను ఫైనల్ చేయటంలో మంత్రులు కేటాయార్, హరీష్ రావు కూడా కొంత కసరత్తు చేశారని పార్టీలో టాక్ వినిపిస్తోంది.

ముందు వీళ్ళిద్దరి స్ధాయిలో అభ్యర్ధుల జాబితా వడపోత జరిగిందని తర్వాతే జాబితా కేసీయార్ దగ్గరకు చేరిందనే టాక్ బాగా వినబడుతోంది. ఏదేమైనా శ్రావణమాసం నాటికి మొదటి జాబితా ఫైనల్ అయ్యేట్లే ఉంది చూస్తుంటే. పార్టీ కార్యక్రమాలకు కూడా కేసీయార్ పెద్దగా హాజరవ్వటంలేదు.  అలాగే సీనియర్ నేతలను కూడా కలవటంలేదు. మహారాష్ట్ర నుండి వచ్చిన నేతలను మాత్రమే కేసీయార్ ప్రయారిటి ఇచ్చి కలుస్తున్నారు. మహారాష్ట్రతో పోల్చుకుంటే ముందు తెలంగాణాలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టే ఇక్కడి జాబితా ఫైనల్ కు ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్ధమవుతోంది. మరి మొదటిజాబితాలో ఎవరిపేర్లుంటాయో చూడాల్సిందే.