కవిత శపథం నెరవేరుతుందా ?

kavitha

ఆరు నూరైనా లేదా నూరు ఆరైనా సరే రాబోయే ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ ను ఓడించి తీరుతానని కల్వకుంట్ల కవిత భీషణ ప్రతిజ్ఞ చేశారు. అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా పోటీచేస్తే ఓడించటం కాదట ఎక్కడ పోటీచేసినా అక్కడికి వెళ్ళి మరీ ఓడిస్తానని ప్రకటించారు. తనది నిజామాబాదేనని తన కట్టె కాలేవరకు నిజామాబాద్ లోనే ఉంటానని కూడా ప్రకటించారు. కవితది నిజామాబాద్ ఎలాగైందో ఆమె చెప్పాలి. ఇక్కడి నుండి ఒకసారి పోటీచేసి గెలిచారు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు.

రెండోసారి పోటీచేసినపుడు అర్విందే గెలిచారు. బహుశా తనను అర్వింద్ ఓడించారనే మంట కవితలో బాగా పెరిగిపోతోందేమో. అందుకనే ఎంపీని ఓడిస్తే కానీ ఆమెలోని మంట చల్లారేట్లు లేదు. అయితే అందుకు తగ్గట్లుగా ఆమె మొదలుపెట్టిన కార్యాచరణ ఏమిటన్నదే ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఎంపీగా ఓడిపోయిన తర్వాత చాలా కాలం అసలు నిజామాబాద్ వైపే చూడలేదు. ఎంఎల్సీ అయిన తర్వాత నిజామాబాద్ ను కవిత పట్టించుకోలేదన్నది వాస్తవం.

ఎన్నికలు సమీపిస్తున్నాయన్న కారణంగా మాత్రమే కవిత ఈ మధ్యనే నియోజకవర్గంలో మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఎందుకంటే రాబోయేఎన్నికల్లో మళ్ళీ ఎంపీగా పోటీచేయబోతున్నారట. తనకు ప్రత్యర్ధిగా అర్విందే ఉంటారన్న అంచనాతోనే ఎంపీని ఓడిస్తానని శపథం చేసింది. నిజామాబాద్ ఎంపీగా కాకుండా అర్వింద్ కోరుట్ల ఎంఎల్ఏగా పోటీచేసినా సరే ఓడించటం ఖాయమని చెప్పేశారు. అంటే అర్వింద్ పోటీపై కవితకు అనుమానమున్నట్లుంది.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎంపీలందరినీ కచ్చితంగా ఎంఎల్ఏలుగానే పోటీచేయాలని బీజేపీ అగ్రనేతలు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. తాను పలానా నియోజకవర్గం నుండి పోటీచేస్తానని ఇప్పటివరకు అర్వింద్ ఎక్కడా ప్రకటించలేదు. అయితే కవిత మాత్రం కోరుట్లలో పోటీచేసినా ఓడిస్తానంటున్నారు. మరి కాంగ్రెస్ మాటేమిటన్న ప్రశ్నకు రాబోయే ఎన్నికల్లో హస్తంపార్టీ జిల్లా మొత్తంమీద ఒక్కసీటు కూడా గెలవదని జోస్యం చెప్పేశారు. బీఆర్ఎస్-బీజేపీలు గెలుపుకోసం గట్టిగా ప్రయత్నించినపుడు మధ్యలో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలుంటాయని కవిత మరచిపోయినట్లున్నారు. ఇంతచెప్పిన మాజీ ఎంపీ కేసీయార్ ప్రభుత్వంపై జనాల్లోని వ్యతిరేకతను పట్టించుకున్నట్లు లేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.