బయటపడిన మోడీ డొల్లతనం

ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నరేంద్రమోడీ డొల్లతనం బయటపడింది. మణిపూర్ అల్లర్ల నేపధ్యంలో నిరసనగా ఇండియా కూటమి, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దాని ప్రకారమే 8,9,10 తేదీల్లో పార్లమెంటులో చర్చలు కూడా జరిగాయి. మూడురోజులు మణిపూర్ అల్లర్ల విషయంలో రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు ఏ విధంగా విఫలమయ్యాయో ప్రతిపక్షాలు తీవ్రంగా ఎండగట్టాయి. మణిపూర్లో జరిగిన అల్లర్లను దేశం మొత్తానికి తెలియజేయటానికే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని మార్గంగా ఎంచుకున్నాయి.

ప్రతిపక్షాలన్నీ మాట్లాడేసిన తర్వాత ఫైనల్ గా మోడీ జవాబిచ్చారు. మామూలుగా అయితే ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు సమాధానం ఉంటుంది. అలాగే మణిపూర్లో జరిగిందేమిటి ? కేంద్రం తీసుకున్న చర్యలు తదితరాలను సమాధానం రూపంలో చెప్పాలి. కానీ మోడీ చేసిందేమంటే ఇండియా కూటమిని టార్గెట్ చేస్తు మాట్లాడారు. దాదాపు మూడుగంటలపాటు మోడీ మాట్లాడితే అందులో సుమారు 2.3 గంటల పాటు ప్రతిపక్షాలపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు.

ఇక్కడ విషయం ప్రతిపక్షాలపై ఆరోపణలు, విమర్శలు చేయటం కాదు. మణిపూర్లో అల్లర్లను కంట్రోల్ చేయటానికి కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏమి చర్యలు తీసుకోబోతున్నారు లేదా తీసుకున్నారు అన్న విషయాన్ని చెప్పాలి. కానీ మోడీ అది చెప్పకుండా రాజకీయ ఉపన్యాసమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, ప్రతిపక్షాల వల్ల దేశానికి ఏ విధంగా నష్టం జరుగుతోందో వివరించారు. దేశానికి కాంగ్రెస్ వల్ల జరిగిన నష్టాన్ని ప్రస్తావించారు.

ప్రతిపక్షాలు మాట్లాడింది ఒకటి, అడిగిన ప్రశ్న మణిపూర్ కు సంబంధించి అయితే మోడీ మాట్లాడింది వేరు, చెప్పిన సమాధానం వేరు. మణిపూర్లో అల్లర్లకు సంబంధించి మోడీ మాట్లాడింది చాలా తక్కువ. ఇక్కడే మోడీలోని డొల్లతనం బయడపడిపోయింది. కేవలం సంఖ్యాబలం కారణంగా మాత్రమే అవిశ్వాస తీర్మానంలో మోడీ ప్రభుత్వం గెలిచింది. అంతే కానీ మణిపూర్ జనాల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని అయితే పెంచలేకపోయింది. మణిపూర్లో జరిగింది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమే అని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అంగీకెరించటంతోనే ప్రతిపక్షాలకు విజయం దక్కిందని అర్ధమైపోయింది.