కేసీయార్ కు షాకిచ్చిన గద్దర్ కొడుకు

కేసీయార్ కు ప్రాజగాయకుడు గద్దర్ కొడుకు సూర్యం పెద్దద షాకిచ్చారు. మీడియాతో మాట్లాడుతు కేసీయార్ పై మండిపోయారు. తన తండ్రిని కేసీయార్ ప్రభుత్వం బాగా టార్చర్ పెట్టిందన్నారు. ప్రత్యేక తెలంగాణా రాకముందు తన తండ్రి ఒక రకమైన టార్చర్ అనుభవిస్తే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో రకమైన టార్చర్ అనుభవించినట్లు చెప్పారు. అంటే కేసీయార్ ప్రభుత్వం కూడా తన తండ్రిని బాగా టార్చర్ చేసిందని డైరెక్టుగా చెప్పకనే సూర్యం చెప్పారు.

 కేసీయార్ పై వ్యతిరేకంగానే తన తండ్రి రాబోయే ఎన్నికల్లో గజ్వేలు నియోజకవర్గంలో పోటీచేయాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. తాను కూడా తన తండ్రి బాటలోనే నడుస్తానని సూర్యం స్పష్టంగా ప్రకటించారు. అంటే తన వైఖరి కూడా కేసీయార్ కు వ్యతిరేకంగానే ఉంటుందని చెప్పేశారు. కేసీయార్ ప్రభుత్వం తన తండ్రిని టార్చర్ పెడితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమకు అండగా నిలిచినట్లు కూడా చెప్పారు. దీని అర్ధం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీచేస్తానని తేల్చి చెప్పటమే.

ఇపుడిదంతా ఎందుకంటే గద్దర్ మరణం తాలూకు సానుభూతిని అడ్వాంటేజ్ తీసుకోవటానికి సూర్యంను తమ తరపున ఎన్నికల్లో దింపాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బతికున్నంతకాలం గద్దర్ ను దూరంపెట్టిన కేసీయార్ చనిపోయిన వెంటనే అధికారిక లాంఛనాలతో దహనక్రియలు చేయటమే దీనికి నిదర్శనం. సూర్యం కూడా ఇదే విషయాన్ని కేసీయార్ ను సూటిగా ప్రశ్నించారు.

బతికున్నపుడు ఒక్కసారిగా కూడా ఇంటర్వ్యూ ఇవ్వని కేసీయార్ చనిపోయిన తర్వాత అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో ఎందుకు నిర్వహించినట్లని గట్టిగానే నిలదీశారు. దానికి కేసీయార్ వైపునుండి ఎలాంటి సమాధానం రాలేదు. తుప్రాన్ లో తమకున్న అర్ధగుంట భూమి ప్రాజెక్టులో పోతే తమకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని ఇవ్వలేదన్నారు. ఇదే విషయమై ఎంఆర్వో, ఆర్డీవో, కలెక్టర్లను ఎన్నిసార్లు కలిసినా ఉపయోగంలేపోయిందన్నారు. పాత కేసుల్లో పోలీసులు తన తండ్రిని బాగా వేదించినట్లు చెప్పి సూర్యం  బాధపడ్డారు. మొదటినుండి తమకు అండగా నిలిచింది రేవంత్ రెడ్డే అని చెప్పటం ద్వారా సూర్యం తన భవిష్యత్ ఎవరితో ఉంటుందో చెప్పేసినట్లే.