షర్మిల పార్టీ విలీనం ఖాయమైందా?

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపి విలీనం ఖాయమైపోయిందా ? అయ్యిందనే అంటున్నాయి రెండుపార్టీల వర్గాలు. ఈనెల 12 వ తేదీన షర్మిల ఢిల్లీకి వెళ్ళి పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అవుతారని చెబుతున్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపి విలీనం గురించి ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కొంతకాలంగా రెండుపార్టీల మధ్య పొత్తా లేకపోతే విలీనమా అనే విషయమై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

మొదట్లో షర్మిలేమో పొత్తుకు మొగ్గుచూపితే కాంగ్రెస్ నేతలేమో విలీనానికే పట్టుబట్టారు. అయితే రెండు పద్దతుల్లో లాభనష్టాలపై చర్చలు జరిగిన తర్వాత షర్మిల కూడా విలీనానికే సిద్ధపడ్డారు. అయితే షర్మిలను ఏపీ అధ్యక్షురాలిగా చేసి పార్టీ పగ్గాలను అప్పగిస్తామని అధిష్టానం చెప్పింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలోపేతం చేయాలని షరతు విధించింది. అందుకు షర్మిల అంగీకరించలేదు.

రాజకీయాల్లో ఉన్నంతవరకు తాను తెలంగాణాలోనే ఉంటానని స్పష్టంగా చెప్పేశారు. కాదు కూడదంటే అసలు విలీనమూ జరగదు, పొత్తూ అవసరంలేదని తేల్చిచెప్పేశారు. దాంతో అధిష్టానం వెనక్కుతగ్గి షర్మిలను తెలంగాణాలోనే ఉండటానికి అంగీకరించింది. ఇక అప్పుడు రాబోయే ఎన్నికల్లో షర్మిల పోటీ చేయబోయే నియోజకవర్గంపై చర్చలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ స్ధానంలో పోటీ చేసేట్లుగా చర్చలు జరుగుతున్నాయి.

మరీ రెండింటిలో ఏది ఫిక్సవుతుందో తెలీదు కానీ మొత్తానికి విలీనం ముహూర్తమైతే ఫిక్సయిపోయిందట. ఈ మొత్తం వ్యవహారాన్ని  కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివరకుమార్ సమన్వయం చేశారు. అటు అధిష్టానానికి కోపం రాకుండా ఇటు షర్మిలకు ఇబ్బందులు రాకుండా డీకే సమన్వయ బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించినట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. షర్మిల రాకను మొదటి నుండి తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే రేవంత్ అభ్యంతరాలను, వ్యతిరేకతను అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ఇదే సమయంలో కొందరు సీనియర్లు షర్మిల రాకను ఆహ్వానిస్తున్నారు. మరి చివరకు ఎన్నికల్లో ఏమవుతుందనే ఆసక్తి పెరిగిపోతోంది.