ఇక అన్నీ ఢిల్లీలోనేనా?

ప్రత్యర్ధి పార్టీలను దెబ్బకొట్టి అధికారంలోకి రావాలన్నది బీజేపీ నేతల పట్టుదల. ప్రత్యర్ధిపార్టీలంటే ముఖ్యంగా బీఆర్ఎస్ అనే అర్ధం. ఎందుకంటే అధికారంలో ఉన్నపార్టీ కాబట్టే. అధికారంలో ఉంది కాబట్టే ఇంటెలిజెన్స్, పోలీసులు వ్యవస్ధలు  మొత్తం బీఆర్ఎస్ కంట్రోల్లోనే ఉంటుంది. హైదరాబాద్ పార్టీ ఆఫీసులోనో లేకపోతే ఏదైనా హోటల్లోనో ఎలాంటి మీటింగులు పెట్టుకున్నా వెంటనే అధికారపార్టీకి తెలిసిపోతోందట. అందుకనే ఇకనుండి కీలకమైన భేటీలన్నీ ఢిల్లీల్లోనే జరపాలని అగ్రనేతలు నిర్ణయించినట్లు సమాచారం.  

నిర్ణయాలు తీసుకోవటం, తీసుకున్న నిర్ణయాలు అమల్లోకి వచ్చిన తర్వాత అందరికీ తెలియటం ఒకఎత్తు. కానీ చర్చల్లో ఉండగానే కొన్ని నిర్ణయాలు అధికారపార్టీకి చేరిపోయాయట. అందుకనే ఇకనుండి రాష్ట్ర స్ధాయిలోని కీలక నేతల సమావేశాలు కూడా ఢిల్లీలోనే జరపాలని డిసైడ్ అయ్యింది. ఇది కొంచెం శ్రమ, ఖర్చులతో కూడిన వ్యవహారమే అయినప్పటికి గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా భేటీలను హైదరాబాద్ నుండి ఢిల్లీకి మార్చక తప్పటంలేదని అనుకుంటున్నారు.

పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే నిఘావ్యవస్ధ ఎంత పటిష్టంగా ఉండాలో ప్రత్యేకించి ఎవరికీ చెప్పక్కర్లేదు. ఇదే సమయంలో తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న చర్చలన్నీ సమావేశంలో పాల్గొన్న నేతల మధ్యే ఉండాలి. అంతేకానీ ఒకవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు లీకులు వెళ్ళిపోతుంటే ఇక చర్చలేంటి, తీసుకునే నిర్ణయాలేంటి ? మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ వేసుకున్న ప్రతి ప్లాన్ బీఆర్ఎస్ కు తెలిసిపోయిందట. ఎలా తెలిసిపోతోందనే విషయమై ఆరా తీయటానికి అప్పట్లో పార్టీ అగ్రనేతలు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ తెలుసుకోలేకపోయారు.

అయితే పోలింగ్ మరో వారంరోజులుందనగా చాలామంది బీజేపీ నేతలు బీఆర్ఎస్ లో చేరిపోయారు. దాంతో తమ పార్టీ నేతల్లోనే ఎవరో బీఆర్ఎస్ కు ఉప్పందించారనే విషయం అర్ధమైంది. అందుకనే అప్పటినుండి బీజేపీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ చాలాకాలంగా జాగ్రత్తగా ఉంది. మంతనాలు, చేరికలంతా అయితే కర్నాటక లేకపోతే ఢిల్లీలోనే జరుగుతున్నది. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా ఏ నేత ఏ పార్టీలో ఉంటారో కూడా తెలీటంలేదు. అందుకనే ప్రత్యర్ధులను దెబ్బతీయటమే టార్గెట్ గా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.