ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గద్దర్ ను బ్రతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గద్దర్ మృతి పట్ల తెలంగాణలోని పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

1949లో తెలంగాణలోని తూఫ్రాన్ లో గద్దర్ జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్రావు. ప్రజా కవిగా, గాయకుడిగా పేరున్న గద్దర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జానపదాలతో ఉద్యమానికి కొత్త ఊపునిచ్చారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ముఖ్య భూమిక పోషించారు. తెలంగాణలోని మారుమూల పల్లెలకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతపై తన గళం విప్పారు.

1975లో కెనరా బ్యాంకులో క్లర్క్ గా గద్దర్ పనిచేశారు. ఆ తర్వాత విమలను పెళ్లి చేసుకున్నారు. గద్దర్ కు సూర్యుడు,చంద్రుడు, వెన్నెల అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో చంద్రుడు 2003లో అనారోగ్యంతో చనిపోయారు. మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో గద్దర్ నటించి ప్రశంసలు అందుకున్నారు.

బండెనక బండి కట్టి అంటూ స్వయంగా ఆడిపడిన గద్దర్ ఆ పాటకు వన్నె తెచ్చారు. తెలంగాణ ఉద్యమం, దళితుల సమస్యలపై పోరాడేందుకు గద్దర్ 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో ప్రకాశం జిల్లాలోని కారంచేడులో దళితుల ఊచకోత చూసి గద్దర్ చలించిపోయారు. ఆ హత్యలకు వ్యతిరేకంగా గద్దర్ తీవ్రంగా పోరాడారు. 1997 ఏప్రిల్ 6న పోలీసులు కాల్పులలో గద్దర్ తూటాలకు ఎదురొడ్డారు. ఇప్పటికే గద్దర్ శరీరంలో ఒక బుల్లెట్ అలాగే ఉండిపోయింది.