కేసీయార్ వ్యూహమిదేనా ?

తెలంగాణా సీఎం కేసీఆర్ ఎప్పుడేమి మాట్లాడుతారో ? ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలీదు. ఇందుకు తాజా ఉదాహరణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయమే. మొన్ననే జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయం తీసుకున్నది. తాజా నిర్ణయంతో ఆర్టీసీలోని 43,373 మంది ఉద్యోగులు, కార్మికులు ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగులైపోయారు. దశాబ్దాలుగా కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉన్న వేలాదిమంది ఉద్యోగులు, కార్మికులు తాము ప్రభుత్వ ఉద్యోగులమవుతామని ఎప్పుడూ కలకూడా కనలేదు.

నాలుగేళ్ళ క్రితం ఇదే డిమాండుతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు 47 రోజులు సమ్మెచేసిన విషయం తెలిసిందే. ఆ సమ్మె కాలంలోనే 53 మంది చనిపోయారు. అయినా సరే కేసీయార్ సమ్మెను పట్టించుకోలేదు. పైగా తెలంగాణా భవన్లో మీడియాతో మాట్లాడుతు భూగోళమున్నంతవరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవటమన్నది జరగదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆర్టీసీని చేయగానే మిగిలిన కార్పొరేషన్లు కూడా డిమాండ్లు చేస్తే అప్పుడు ప్రభుత్వం ఏమిచేయాలని కేసీయార్ ప్రశ్నించారు.

మరి ఇపుడు ఎవరూ అడగకుండానే ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేసుకుంటున్నట్లు నిర్ణయించారు ? ఇందుకు రెండు కారణాలున్నట్లు తెలుస్తోంది. మొదటిది రాబోయే ఎన్నికలు. ఇక రెండో కారణం ఆర్టీసీకి ఉన్న ఆస్తులు. రాబోయే ఎన్నికల్లో 43 వేలమంది ఉద్యోగ, కార్మికులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయబోతున్నట్లు కేసీయార్ అనుమానించినట్లున్నారు. వాళ్ళని మంచి చేసుకునేందుకే విలీనం నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇక రెండో కారణం ఆస్తుల వ్యవహారం. సంస్ధకు లక్ష కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోల్లో కొన్ని నిరర్ధకంగా ఉన్నాయి. మరికొన్ని ఖాళీస్ధలాలున్నాయి. వీటిన్నింటినీ ప్రభుత్వం తీసుకోవాలంటే సాధ్యంకాదు. అసలే కేసీయార్ పై ఉద్యోగులు, కార్మికులు మండిపోతున్నారు. అయితే ఏమీ చేయలేక నోరుమూసుకుని కూర్చున్నారు. అలాంటిది ఆస్తులను తీసుకునే ప్రయత్నంచేస్తే గోల చేసేయటం ఖాయం. ఇపుడు ప్రభుత్వానికి నిధులు చాలా అవసరం. అందుకనే ముందుగా ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసేసుకుంటే ఆస్తులు కూడా ఆటోమేటిక్కుగా ప్రభుత్వానికి వచ్చేస్తాయి. అప్పుడు తమిష్టంవచ్చినట్లు వాడుకోవచ్చని కేసీయార్ ప్లాన్ చేశారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.