ప్రాజెక్టుల టాపిక్ డైవర్షన్ కోసమే అంబటి ‘బ్రో’ రచ్చ

టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన బ్రో చిత్రంపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టారని రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పవన్, త్రివిక్రమ్, ఆ చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ పై అంబటి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు, ఆ చిత్రాన్ని నిర్మాణం కోసం అమెరికా నుంచి ఫండ్స్ ను ఇండియాకు తరలించారని, బ్లాక్ మనీని వైట్ గా మార్చి పవన్ కు ప్యాకేజీలా చంద్రబాబు ఇచ్చారని ఆరోపించారు.

ఆ నిధుల వ్యవహారంపై ఈడీని, సీబీఐని ఆశ్రయిస్తానని కూడా చెప్పారు. ఏదో ఫ్లోలో అంబటి అలా అన్నారని అంతా అనుకున్నారు. కానీ, ఆ వ్యవహారంపై నిర్మాత క్లారిటీనిచ్చినా…అంబటి మాత్రం తగ్గడం లేదు. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అంబటి చెప్పారు. ఒక కీలకమైన విషయం కోసం తాను ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు. ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత అన్ని వివరాలను మీడియాకు వెల్లడిస్తానని అన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్, నిధులకు సంబంధించి నిర్మాత వెర్షన్, తన వెర్షన్ అందరికీ తెలుసని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే అంబటిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోండగా…చంద్రబాబు, పవన్ లపై విమర్శలు వస్తున్నాయి. పోలవరం సహా ఏ ప్రాజెక్టుకు నిధులు కావాలని ఢిల్లీ గడప తొక్కని అంబటి…బ్రో అంటూ పనికిమాలిన విషయంపై ఢిల్లీ వెళ్తున్నారని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ఇక, రాయలసీమలో చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన వ్యవహారంతో వైసీపీకి, నీటిపారుదల శాఖా మంత్రి అంబటికి భారీ డ్యామేజీ జరిగిందని, అందుకే ఆ టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు బ్రో పంచాయతీని అంబటి పెట్టారని అంటున్నారు. అంబటి ట్రాప్ లో చంద్రబాబు, పవన్ పడ్డారని కామెంట్లు చేస్తున్నారు.