న్యూడ్ కాల్..మాజీ సీఎం కొడుకుపై మహిళ ఫిర్యాదు

ఈ మధ్యకాలంలో దేశంలోని కొందరు నేతల కామ క్రీడలు రచ్చకెక్కి రాజకీయాలను భ్రష్టుపట్టించిన సంగతి తెలిసిందే. ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇక, మంత్రి అంబటి రాంబాబు ఆడియో టేప్ లీక్ వంటి వ్యవహారాలు ఇప్పటికీ వైరల్ గానే ఉన్నాయి. ఒక్క ఏపీలోనే కాదు….చాలా రాష్ట్రాలలో అధికార పార్టీకి చెందిన నేతాశ్రీలు..స్త్రీలోలులుగా మారి తమ పరువు తీసుకుంటున్నారు. తాజాగా ఈ కోవలోకే తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం కుమారుడు, అన్నాడీఎంకే నేత, థేనీ ఎంపీ రవీంద్రనాథ్ వస్తారు.

రవీంద్రనాథ్‌పై తాజాగా ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తన కోరిక తీర్చాలంటూ ఎంపీ రవీంద్రనాథ్ తనను వేధిస్తున్నారంటూ తమిళనాడు డీజీపీకి ఓ మహిళ ఫిర్యాదు చేసిన వైనం సంచలనం రేపుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఆయన వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, న్యూడ్ కాల్స్ చేయాలని తనను పదేపదే వేధిస్తున్నారని, ఒకవేళ తనకు లొంగకుంటే చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై తాను గతంలో తాంబారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే ఆమె ఫిర్యాదును పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. అయితే, రవీంద్రనాథ్ ఆల్రెడీ మరో వివాదంలో ఉన్నారు. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు తప్పుగా చూపారంటూ రవీంద్రనాథ్ పై ఓ ఓటర్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో, విచారణ జరిపిన న్యాయస్థానం రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని ఈ ఏడాది జులైలో తీర్పునిచ్చింది. అయితే, సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాలు చేసుకునేందుకు వీలుగా నెల రోజుల పాటు తీర్పు వాయిదా వేసింది. ఆల్రెడీ చిక్కుల్లో మూలిగే నక్కలా ఉన్న రవీంద్రరనాథ్ పై తాటికాయలాగా ఆ మహిళ ఆరోపణలు చేయడంతో మాజీ సీఎం కుమారుడు ఇరకాటంలో పడ్డారు.