కేసీయారే అస్త్రాలను అందిస్తున్నారా ?

ఎవరైనా తమను వాయించమని తమ ప్రత్యర్ధులకు తమంతట తాముగా ఆయుధాలను అందిస్తారా ? తెలంగాణలో కేసీఆర్ వ్యవహారం అలాగే ఉంది చూస్తుంటే. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీనే ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. రైతులకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ నాలుగు విడతల్లో రుణమాఫీని పూర్తిచేయనున్నట్లు కూడా ప్రకటించారు.

అప్పట్లో ప్రభుత్వం అంచనా ప్రకారం రు. 27 వేల కోట్లు రుణాలను మాఫీ చేయాలి. గడచిన నాలుగేళ్ళలో ప్రభుత్వం చేసిన మాఫీ కేవలం రూ. 1205 కోట్లు మాత్రమే. అంటే చేయాల్సిన మాఫీ సుమారు 26 వేల కోట్ల రూపాయులుంది. పోయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేరకపోగా మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ప్రతి ఏడాది బడ్జెట్ లో కేటాయింపులు ఘనంగా చూపిస్తున్నారు. అయితే ఏ ఏడాది కూడా నిధులను మంజూరు చేయడం లేదు. దాంతో రుణమాఫీ అలాగే ఉండిపోయింది.

చివరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా రుణమాఫీ పై చర్చించేందుకు మంత్రులు సాహసించలేదు. క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీ పై చర్చ జరుగుతుందని, ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుంటుందని ఆశించిన లక్షలాది రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. దీన్నే కాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్ద అస్త్రంగా మలచుకోబోతున్నారు. ఇపుడు ప్రతిపక్షాలకు కేసీయార్ అండ్ కో సమాధానం చెప్పకపోయినా, అసెంబ్లీ సమావేశాల్లో సమాధానం చెప్పకపోయినా ఏమీకాదు.

కానీ రేపటి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు కేసీయార్ అయినా మంత్రులు, ఎంఎల్ఏలు రైతులకు ఏమని సమాధానం చెబుతారు. ఇపుడు ప్రతిపక్షాల నోళ్ళు మూయించినట్లు రేపు ఎన్నికల సందర్భంగా రైతుల నోళ్ళు మూయించలేరు. ఎందుకంటే కేసీఆర్ హామీని నమ్ముకుని రైతులు బ్యాంకులకు వాయిదాలు కట్టడం మానేశారు. దాంతో రైతులకు కొత్తప్పులు కావాలంటే బ్యాంకులు ఇవ్వటం లేదు. ఇటు ప్రభుత్వం రుణమాఫీలు చేయక అటు బ్యాంకులు కొత్తప్పులు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్ధితి దయనీయంగా తయారైంది. అందుకనే మండిపోతున్న రైతాంగం ఎన్నికల్లో ఏమిచేస్తారనే ఆసక్తి పెరిగిపోతోంది.