ఆ సీట్ ఇస్తాం.. జ‌య‌సుధ‌కు బీజేపీ ఆఫ‌ర్!

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కిష‌న్‌రెడ్డి.. రాష్ట్రంలో పార్టీలో జోష్ పెంచే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. ఓ వైపు డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అంటూనే.. మ‌రోవైపు వ‌ర‌ద‌ల‌పైనా కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక పార్టీని బ‌లోపేతం చేయడంపైనా కిష‌న్‌రెడ్డి దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చేరిక‌ల‌పై ఆయ‌న ఫోక‌స్ పెట్టారు. ఈ నేప‌థ్యంలో మాజీ ఎమ్మెల్యే, సినీ న‌టి జ‌య‌సుధ‌ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్ర‌యత్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది.

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్‌రెడ్డితో క‌లిసి పార్టీలో చేరిక‌ల‌పై కిష‌న్ రెడ్డి ఫోక‌స్ పెట్టార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. తాను సీఎంగా ఉన్న‌ప్పుడు కాంగ్రెస్‌లో కీల‌క ప‌ద‌వుల్లో ఉండి, ఇప్పుడు ఏ ప్రాధాన్య‌త లేని నాయ‌కుల‌ను బీజేపీలోకి ర‌ప్పించేందుకు కిర‌ణ్‌కుమార్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేంద‌ర్‌, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డితో పాటు మ‌రికొంత మంది నాయ‌కుల‌తో ఆయ‌న ఢిల్లీ వెళ్తున్నారు. ఇందులో భాగంగానే జ‌య‌సుధ‌ను కూడా పార్టీలో చేర్చేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

2009లో సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌య‌సుధ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ త‌ర్వాత ఓట‌మితో సైలెంట్ అయిపోయారు. మ‌రోవైపు కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వల్ల సినిమాల్లోనూ పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరారు. కానీ ఇప్పుడామె బీజేపీలో చేర‌డం గురించి ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది. పైగా సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం కూడా కిష‌న్ రెడ్డి గుప్పిట్లోనే ఉంది. దీంతో జ‌య‌సుధ‌ను అదే స్థానంలో నిల‌బెట్టాల‌ని ఆయ‌న చూస్తున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ నుంచి బీజేపీ త‌ర‌పున జ‌య‌సుధ పోటీ చేయ‌డం ఖాయం!