జగన్ కు కొత్త తలనొప్పి మొదలైందా ?

ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు సన్నిహితులే. మరోవైపు ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం. వాళ్ళిద్దరి మధ్య మొదలైన వివాదంతో జగన్ కు తలనొప్పులు పెరిగిపోతున్నట్లున్నాయి. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్ధం అవుతున్నట్లు లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీలో మంటలు మొదలయ్యాయి. వచ్చేఎన్నికల్లో కూడా ఎంఎల్ఏ, మంత్రి వేణుగోపాలకృష్ణే మళ్ళీ పోటీచేస్తారని జగన్ తరపున ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. అప్పటికే ఇక్కడ పోటీకి రెడీ అవుతున్న రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మండింది.

అక్కడినుండి గొడవలు మొదలై చివరకు జగన్ పై తిరుగుబాటు చేసేదాకా చేరుకుంది. ఇటు పిల్లి అటు చెల్లుబోయిన ఇద్దరు జగన్ కు సన్నిహితులనే చెప్పాలి. రామచంద్రాపురం తన నియోజకవర్గం కాబట్టి రాబోయే ఎన్నికల్లో తాను లేదా కొడుకు పోటీచేయాలన్నది పిల్లి వాదన. అయితే ప్రస్తుతం తానే సిట్టింగ్ ఎంఎల్ఏ కాబట్టి తానే పోటీచేస్తానని వేణు అంటున్నారు. వేణునే వచ్చేఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు జగన్ డిసైడ్ చేసి ఎంపీ మిథున్ రెడ్డితో ప్రకటన చేయించారు.

అక్కడినుండి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలు ఏ స్ధాయికి చేరుకున్నదంతా జగన్ పై పిల్లి తిరుగుబాటు చేసేంత దాకా. వేణుయే పోటీ చేసేట్లయితే తాను ఇండిపెండెంటుగా అయినా పోటీచేస్తానని పిల్లి ప్రకటన సంచలనంగా మారింది. వేణును ఎట్టి పరిస్ధితుల్లోను అభ్యర్ధిగా అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. చెల్లుబోయిన గనుక పోటీవిషయంలో తనంతట తానుగా వెనక్కు తగ్గకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు తప్పేట్లు లేదు.

పార్టీ అభ్యర్ధిగా చెల్లుబోయిన, ఇండిపెండెంట్ గా పిల్లి పోటీచేస్తే ప్రత్యర్థి పార్టీ లాభపడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదే జరిగితే జగన్ కు నష్టం+ప్రిస్టేజి. మరిపుడు ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. ఒకవేళ చెల్లుబోయినను అభ్యర్ధిగా ఉపసంహరించుకుంటే ఇవే డిమాండ్లు మరిన్ని నియోజకవర్గాల్లో ఊపందుకుంటాయి. అప్పుడు పార్టీకి మరింతగా డ్యామేజీ ఖాయం. ఈ నేపథ్యంలో ఏమిచేయాలో జగన్ కు అర్ధంకావటం లేదు. ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్లుగా తయారైంది జగన్ పరిస్ధితి.