బండి సంజయ్ కోసం బాత్రూంలో ఏడ్చారట

తెలగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించి ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని బీజేపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ కు కేంద్ర స్థాయిలో పదవి ఇస్తారని టాక్ వచ్చింది. అయితే, ఆ పదవి పై బండి సంజయ్ కు ఆసక్తి లేదని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానే కొనసాగాలని ఆయనకు ఉందని ప్రచారం జరిగింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో గెలిపించుకొని సీఎం అవుదామని ఆయన ఆశపడ్డారని, ఆయన అనుచరులు కూడా సీఎం సీఎం అంటూ బండి సంజయ్ సమక్షంలో నినాదాలు చేశారని టాక్ వచ్చింది.

బండి సంజయ్ ను తొలగించడంతో ఆయన అభిమానులు, అనుచరులు తీవ్ర ఆవేదనకు గురైన సంగతి తెలిసిందే. అయితే, బండి సంజయ్ తొలగింపు ఆయన అనుచరులకే కాదు…మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కూడా తీవ్ర భావోద్వేగాన్ని మిగిల్చిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కిషన్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డి స్వయంగా వెల్లడించడం విశేషం. రాజ గోపాల్‌ రెడ్డి చేసిన కామెంట్లు బీజేపీ నేతలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించినపుడు తనకు కన్నీళ్లు వచ్చాయని, ఆ టైంలో బాత్రూంకి వెళ్లి ఏడ్చానని రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజీలేని పోరాటంతో పార్టీకి సంజయ్ కొత్త ఊపు తెచ్చారని కొనియాడారు. అందుకే, ఆయన తొలగింపు తనకు బాధ కలిగించిందని అన్నారు. కానీ, బీజేపీ అధిష్టానం నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలన్నారు. అయితే, మొన్న మొన్ననే బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి…బండి సంజయ్ పై ఇంత ప్రేమ చూపించడం పలువురుని ఆశ్చర్యానికి గురి చేసింది.