బీజేపీ-జ‌న‌సేన పొత్తు.. జోగయ్య హాట్ కామెంట్స్‌

తాజాగా ఢిల్లీలో జ‌రిగిన‌ ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల భేటీకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కావ‌డం, బీజేపీతో పొత్తు ఉంటుంద‌ని ఆయ‌న చెప్ప‌డం ప‌ట్ల మాజీ పార్ల‌మెంటు స‌భ్యుడు, కాపు సంక్షేమ సంస్థ అధ్య‌క్షుడు చేగొండి హ‌రిరామ జోగ‌య్య హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయ‌న మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో బీజేపీ.. కేవ‌లం జ‌న‌సేనను వాడుకునేందుకు చూస్తోంద‌ని అన్నారు. ప‌వ‌న్ కు ఉన్న చ‌రిష్మాను వాడుకుని ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని బీజేపీ వ్యూహాలు రెడీ చేసింద‌ని చెప్పారు. అంతేకాదు.. ఏపీలో క్షేత్ర‌స్థాయిలో బీజేపీకి సానుభూతి లేద‌న్నారు.

అంతేకాదు.. ప‌వ‌న్‌తో క‌లిస్తే.. బీజేపీ బ‌ల‌ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కేంద్రంలోని పెద్ద‌లు చాలా వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్‌ను ద‌రి చేర్చుకున్నార‌ని జోగ‌య్య వ్యాఖ్యానించారు. ఫ‌లితంగా బీజేపీ-జ‌న‌సేన‌ల ఓటు బ్యాంకు 2 శాతం పెరుగుతుంద‌ని చెప్పారు. రాష్ట్రంలో విభ‌జ‌న చ‌ట్టానికి కాలం స‌మీపిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ఆ విభ‌జ‌న చ‌ట్టంలోని ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని, అందుకే.. బీజేపీ క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌ప‌డ లేక పోతోంద‌ని.. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌ను చేర్చుకుని బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెప్పారు.

ఏపీలో ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి, వైసీపీ ప్ర‌బుత్వాన్ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించడానికి బీజేపీ నేత‌లు చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉన్నాయ‌ని జోగ‌య్య చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేయకపోవడానికి ఆయనతో ఉన్న సత్సంబంధాలే కారణమ‌ని తేల్చిచెప్పారు. “పార్ల‌మెంటులో అవ‌స‌ర‌మైతే.. జ‌గ‌న్ కావ‌లి. ఇక్క‌డ అప్పులు కావాలంటే.. జ‌గ‌న్‌కు మోడీ కావాలి” అని జోగ‌య్య వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. జోగ‌య్య మ‌రిన్ని హాట్ కామెంట్లుకూడా చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి బీజేపీతో జనసేన పొత్తు ఎంతవరకు లబ్ధి చేస్తుందనేది వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాతే తెలుస్తుందని జోగ‌య్య అన్నారు. ఈ రెండు పార్టీల పొత్తుతో బీజేపీకే ఎక్కువ లాభం జరిగనుంది. అలా కాకుండా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అది జ‌న‌సేన‌కు మెరుగైన ఫ‌లితాన్ని ఇస్తుంది. ప‌లునియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ గెలుస్తుందని చెప్పారు. ఒక వేళ ప‌వ‌న్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఐదేళ్ల‌పాటు ముఖ్య‌మంత్రి పీఠం ఆ పార్టీకే ఇస్తే.. స‌రికాద‌ని, కాపులు హ‌ర్ట‌వుతార‌ని కూడా జోగ‌య్య చెప్ప‌డం గ‌మ‌నార్హం.