బాయ్‌కాట్ చేస్తే ఒక బాధ, సపోర్ట్ చేస్తే మరో బాధ

దేశవ్యాప్తంగా చర్చనీయమవుతున్న యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కొత్త చిక్కులు తెస్తోంది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలలో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు దాన్ని వ్యతరేకించేవారు, మద్దతిచ్చేవారూ రెండువర్గాలూ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఈ బిల్లుకు మద్దతిస్తుందా.. ఇవ్వదా అనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది. మద్దతిస్తే మొన్నమొన్నటివరకు కత్తులు దూసిన బీజేపీకి మద్దతిచ్చినట్లవుతుంది.. ఇవ్వకపోతే బీజేపీ ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్‌తో బీఆర్ఎస్‌కు రహస్య అవగాహన ఉందన్న ఆరోపణలకు ఊతమిచ్చినట్లవుతుంది. దీంతో కేసీఆర్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది.

పార్లమెంటులో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు పెడితే దానికి అనుకూలంగా ఓటేస్తుందా.. వ్యతిరేకిస్తుందా అనే విషయంలో బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ కొన్నాళ్లుగా బీజేపీతో తలపడుతోంది. అయితే, కొద్దిరోజల కిందట ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ రహస్య అవగాహన కుదరిందని.. అందుకే బీఆర్ఎస్ బీజేపీని లక్ష్యం చేసుకోవడం మాని కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోందని విమర్శలు వచ్చాయి. ఆ క్రమంలోనే బీజేపీ కేసీఆర్‌కు అనుకూలంగా ఉండేలా కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని చేసిందని, కవిత లిక్కర్ కేసులో మెత్తబడిందని అంటుంటారు. కానీ, రెండు రోజుల కిందట ప్రధాని మోదీ వరంగల్‌లో సభ నిర్వహిస్తే బీఆర్ఎస్ దాన్ని బహిష్కరించింది.. మోదీ కూడా బీఆర్ఎస్‌పై పదునైన విమర్శలు చేశారు. అందుకు ప్రతిగా బీఆర్ఎస్ నేతలూ తమ నోళ్లకు పనిచెప్పారు.

ఇక కాంగ్రెస్ విషయంలో బీఆర్ఎస్ వైఖరి కనుక చూసుకుంటే పట్నాలో విపక్షాలు సమావేశమైనప్పుడు కేసీఆర్‌ను పిలవలేదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వంటి నేతలు కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే, బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు వచ్చే ఎన్నికలలో కలవబోతున్నాయమంటూ బీజేపీ ఆరోపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో యూసీసీ బిల్లు విషయంలో బీఆర్ఎస్ ఏం చేస్తుందనేది అందరిలో ఆసక్తి పెంచుతోంది. ఈ బిల్లు విషయంలో బీజేపీకి లోక్ సభలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంత మెజారిటీ ఉన్నా రాజ్యసభలో ఆ పార్టీకి సొంత మెజారిటీ చాలదు. 245 మంది సభ్యులుండే రాజ్యసభలో బీజేపీకి 92 మంది ఎంపీలున్నారు. మిత్ర పక్షాల నుంచి మరో 11 ఎంపీలున్నారు. తాజాగా అజిత్ పవార్ వర్గం కలవడంతో వారు మరోగ ముగ్గురు యాడ్ అవుతున్నారు. వీరే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు 10 మంది కూడా మద్దతు ఇవ్వబోతున్నారు… ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీతో తలపడుతున్నా ఈ బిల్లు విషయంలో మాత్రం సపోర్ట్ చేస్తోంది. ఇక వైసీపీ, బీజేడీ వంటి పార్టీలు కూడా సపోర్టు చేసే అవకాశాలున్నాయి. దీంతో బీఆర్ఎస్ అవసరం బీజేపీకి లేదు.. కాబట్టి బీఆర్ఎస్ స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. బీజేపీ బీ టీమ్ అని నిరూపించుకుంటారో.. కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నారని రుజువు చేసుకుంటారో చూడాలి.