రాహుల్ ట్వీట్.. షర్మిల రీట్వీట్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేయగా.. దాన్ని రీట్వీట్ చేస్తూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తి పెంచాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతున్న వేళ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ రాహుల్ గాంధీ ఆయన్ను గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ దార్శినికుడని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కోసం తన జీవితాన్ని ఆయన అంకితం చేశారని కొనియాడుతూ.. వైఎస్సార్ చిరస్మరణీయమైన నేత అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు షర్మిల రీట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెప్పారు. ‘రాజశేఖర్ రెడ్డి జన్మదినాన ఆయన్ను గుర్తు చేసుకుంటూ మీ అభిమానపూర్వక మాటలకు ధన్యవాదాలు. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసిన నేత రాజశేఖర్ రెడ్డి.. చివరి క్షణం వరకు ఆయన ప్రజాసేవకే అంకితమయ్యారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే దేశానికి ఉజ్వల భవిత ఉంటుందని నమ్మిన మనిషి రాజశేఖర్ రెడ్డి. ఆయన్ను మీ గుండెలో శాశ్వతంగా నిలుపుకొన్నందుకు మీకు ధన్యవాదాలు సార్’ అంటూ రాహుల్‌కు షర్మిల బదులిచ్చారు.

కాగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని.. ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని ఓ ప్రచారం సాగుతుండగా.. ఆమె ఏపీపై ఆసక్తి లేదని, తెలంగాణలో రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నారని.. ఆమె కాంగ్రెస్‌లో కలవడం ఖాయమే అయినా ఏ బాధ్యతలు ఇస్తారు.. ఎక్కడి బాధ్యతలు ఇస్తారన్నది ఇంకా తేలలేదని ప్రచారం జరుగుతోంది. ఆమె కాంగ్రెస్‌లో చేరుతారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు కూడా ఇటీవల అన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వైఎస్సార్ కోసం ట్వీట్ చేయడం.. రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తూ షర్మిల సమాధానం ఇవ్వడంతో కాంగ్రెస్, షర్మిల అంశం మరోసారి చర్చనీయమవుతోంది.