హాట్ టాపిక్: కేసీఆర్ లేకుండా కేబినెట్ జరిగిందా?

కీలకమైన అంశం ఒకటి చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. అది కూడా మంత్రి కేటీఆర్ తనకు తానుగా ట్వీట్ చేసిన తర్వాత మాత్రమే బయటకు రావటం మరో విశేషంగా చెప్పక తప్పదు. ఇంతకూ జరిగిందేమంటే.. బుధవారం ఫుడ్ ప్రాసెసింగ్.. లాజిస్టిక్ పాలసీలపై మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటం తెలిసిందే. త్వరలో చేపట్టే పాలసీలను మంత్రులకు వివరించారు.

ఇంచుమించే ఇదే విషయం గురువారం అన్ని పేపర్లలోనూ.. టీవీ చానళ్లలోనూ ప్రసారమైంది. అయితే.. అన్ని మీడియా సంస్థలు.. అసలు పాయింట్ ను వదిలేసి కొసరి పాయింట్ ను పట్టుకొని వార్తల్ని ప్రజలకు అందించారు.

కొద్ది గంటల క్రితం మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. గౌరవనీయ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం.. ఫుడ్ ప్రాసెసింగ్.. లాజిస్టిక్స్ పాలసీలను కేబినెట్ మిత్రులందరికి వివరించినట్లుగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ప్రజంటేషన్ కార్యక్రమం ఏకంగా ఎనిమిది గంటల పాటు సాగిందని.. ఆ సందర్భంగా చర్చకు వచ్చిన కీలక అంశాల్ని త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్ లో చర్చించనున్నట్లు వెల్లడించారు.

అప్పటివరకు కేబినెట్ మంత్రులంతా కలిసి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశం జరగటం.. అది కేబినెట్ తరహాలోనే జరిగిందన్న విషయం బయటకు వచ్చింది. ఇంత కీలక పరిణామం జరిగినా.. మీడియాలో కవర్ కాకపోవటం గమనార్హం.

ఇలా ముఖ్యమంత్రి లేకుండా మంత్రులంతా కలిసి సమావేశమైన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు చోటు చేసుకుంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు.

అలిపిరి దగ్గర చంద్రబాబు మీద దాడి జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ నాయకత్వంలో కేబినెట్ భేటీ జరగ్గా.. అలిపిరి వద్ద వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన సందర్భంలో నాటి కాంగ్రెస్ సీనియర్ నేత రోశయ్య ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ జరిగింది.

తాజాగా..సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్న వేళ.. కేటీఆర్ నాయకత్వాన తాజా భేటీ జరగటం.. అందులో మంత్రులతో పాటు.. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్లు.. అధికారులు పాల్గొనటం గమనార్హం.