విశాఖకు రాహుల్..అమరావతికి ప్రియాంకా

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం పర్యటన దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఖమ్మంలో రాహుల్ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. తెలంగాణ టూర్ ఘన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ పై రాహుల్ గాంధీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. వచ్చే నెలలో విశాఖలో రాహుల్ గాంధీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతు ఇచ్చేందుకు రాహుల్ విశాఖలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే ఢిల్లీకి బయలుదేరే ముందు గన్నవరం విమానాశ్రయంలో ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్, అమరావతి రాజధాని, పోలవరం వంటి పలు విషయాలపై రాహుల్ చర్చించారు. దాంతోపాటు, సీఎం జగన్ పై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల గురించి కూడా రాహుల్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. త్వరలో ఏపీలో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ అమరావతిలో పర్యటించబోతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు ప్రకటించారు. ఏపీకి రాజధాని లేకపోవడం బాధాకరమని, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని వెల్లడించారు.

రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా అంశాలలో ఏపీకి అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీకి ఏపీ కాంగ్రెస్ నేతలు వివరించారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి సంబంధించిన అన్ని హామీలను నెరవేరుస్తామని రాహుల్ భరోసా ఇచ్చారని వెల్లడించారు. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ స్పష్టం చేశారని, ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య సంబంధాలపై కూడా రాహుల్ ఆరా తీశారని చెప్పారు.

ఏపీలో వైసీపీ, జనసేన, టీడీపీలు బిజెపితో కలిసే ఉన్నాయని, కానీ ప్రజల దృష్టిలో విడిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నాయని రాహుల్ కు వెల్లడించామన్నారు. రాహుల్ గాంధీతో రుద్రరాజు, కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు, జెడి శీలం తదితరులు భేటీ అయ్యారు.