ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్‌: ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టూ.. రైలు ప్రాజెక్ట్

India Trains

మ‌రికొన్ని నెల్ల‌లోనే ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో తెలంగాణ‌పై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. హైద‌రాబాద్‌లోని ఔట‌ర్ రింగ్ రోడ్ చుట్టూ.. కొత్త‌గా రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇప్ప‌టికే మెట్రో రైలుప్రాజెక్టును వివిధ ద‌శ‌ల్లో పెంచుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా  రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు కేంద్రం ప‌చ్చ జెండా ఊపింది. ఈ విష‌యాన్ని సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

రైలు రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు దేశంలోనే తొలి ప్రాజెక్టుగా ఆయ‌న పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సర్వే కోసం రైల్వే శాఖ 14 వేల కోట్ల రూపాయ‌లు కేటాయించిందని కిష‌న్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు కార‌ణంగా హైద‌రాబాద్ పేరు మ‌రింత పెరుగుతుంద‌ని.. అభివృద్దిలో దూసుకుపోతుంద‌ని కేంద్ర మంత్రి వివ‌రించారు. రైలుతో అనుసంధానం కానీ, అనేక ప్రాంతాల‌కు ఈ ప్రాజెక్టు క‌లిసి వ‌స్తుంద‌న్నారు.

మొత్తం 26 వేల కోట్ల రూపాయ‌ల వ్య‌యం అంచ‌నాతో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రారంభించ‌నున్న‌ట్టు  కిషన్ రెడ్డి చెప్పారు.  భూసేకరణకు సంబంధించి స‌గం  ఖర్చు కేంద్రమే భరిస్తుందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం వెచ్చించాల‌ని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివ‌రాల‌ను ఇప్ప‌టికే రాష్ట్ర స‌ర్కారుకు చేర‌వేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా సానుకూలంగా స్పందించింద‌ని చెప్పారు. రైలు ప్రాజెక్టుకు భూసేకరణ కోసం కేసీఆర్‌ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని వెల్ల‌డించారు.

రైలు రింగ్ ప్రాజెక్టు రూట్ మ్యాప్‌పై 99 శాతం ఆమోదం లభించిందని కిష‌న్ రెడ్డి చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశలో ఔటరి రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.  రీజినల్ రింగ్ రోడ్ కు సంబంధించి భూ సేకరణ సర్వే చేస్తున్నారని, ఈ ప్రాజెక్టులో ఉత్తర భా­గా­నికి సంబంధించి భూసేకరణ, సర్వే ప్రక్రియ పూ­ర్తైనట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్రాజెక్టుకు భూములు ఇవ్వ‌ని రైతుల‌కు సంబంధించిన ప్రాంతాల‌ను ప‌క్క‌న పెట్టి(సంగారెడ్డి, రాయగిరి) మిగతా చోట్ల  సర్వే పూర్తి చేశారు.