‘వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్’

బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జగన్‌‌పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ చెప్తున్న మూడు రాజధానుల పై ఆయన మండిపడ్డారు.

విశాఖపట్నంలో కడప మాఫియా గ్యాంగ్‌లు కల్లోలం సృష్టిస్తున్నాయని.. ఏకంగా వైసీపీ ఎంపీయే అక్కడ వ్యాపారం చేయలేక హైదరాబాద్ వెళ్లిపోతున్నానని చెప్పారని.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదని ఆయన అన్నారు.

అదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ జగన్ విషయంలో సీరియస్ కామెంట్ చేశారు.. జగన్ తన తాత రాజారెడ్డికి మించిపోయారని.. వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్ అవుతారని ఆయన అన్నారు.

బీసీ సదస్సు పేరిట పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ నిర్వహించిన సభలో కన్నా పార్టీ కార్యకర్తలతో ఉత్సాహం నింపారు. మూడు రాజధానుల పేరుతో విశాఖపట్నాన్ని భూకబ్జాలు, అరాచకాలకు అడ్డాగా మార్చారని ఆయన ఆరోపించారు. విశాఖను దోచుకోవడానికే మూడు రాజధానుల పేరుతో మాయ చేస్తున్నారని అన్నారు.

జగన్ సంగతి తనకు ముందే తెలుసని.. కడప లోక్ సభ ఎన్నికల సమయంలో ఆ జిల్లా ఇంచార్జి మంత్రిగా పనిచేసినప్పుడు తనకు ఆయన సంగతి అర్థమైందని.. వందమంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్‌మోహన్ రెడ్డి అవుతారని.. జగన్ 16 నెలలు జైలులో ఉన్నప్పుడు ఆయన కోసం తల్లి, చెల్లి రాష్ట్రమంతా తిరిగారని.. ఇప్పుడు జగన్ వారిని ఎక్కడుంచారో అందరూ చూస్తున్నారని అన్నారు. జగన్ జనాన్ని నమ్మడం లేదని.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కన్నా ఆరోపించారు.