‘షా’క్ : అమిత్ షా తో కేటీఆర్ భేటీ !

ఉప్పు నిప్పులా వ్యవహరించే ఇద్దరు కీలక నేతల మధ్య భేటీ అయితే ఆ చర్చ మామూలుగా ఉండదు. అయితే ఇలాంటి భేటీలు ఆయా పార్టీ కేడర్ కు కొంచెం ఇబ్బందికరంగా మారుతుంటాయి. తాజాగా తెలంగాణలో అదే జరుగుతోంది. తాజాగా ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ నెం.2, బీఆర్ఎస్ నెం.2 భేటీ అవుతున్నారు. ఈ మీటింగ్ గులాబీ జట్టుకు మేలుగా.. కమలనాథులకు కొత్త కష్టంగా మారుతుందన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు ఈ రోజు (శుక్రవారం) కేటీఆర్ వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇదెవరూ ఊహించని పరిణామం అని చెప్పాలి.

ఢిల్లీ మద్యం కేసులో ఆ మధ్య వరకు దూకుడు ప్రదర్శించి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఖాయమన్న ప్రచారం సాగటం.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లు పెద్ద ఎత్తున కేంద్రంలోని మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించటం తెలిసిందే. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధ వాతావరణం అన్నట్లుగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవటం.. ప్రశాంతంగా ఉండిపోవటం చూశాం. మొన్నటివరకు నిత్యం విమర్శల కత్తి పట్టుకొని మోడీ సర్కారుపై వీరంగం వేసిన కేటీఆర్, కేంద్రంలోని అధికార బీజేపీకి ప్రత్యామ్నాయమే తమ బీఆర్ఎస్ అన్న కేసీఆర్ సైతం.. మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవటం తెలిసిందే. ఈ సైలెన్స్ తర్వాత బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్య ఒప్పందం కుదిరినట్లుగా ప్రచారం మొదలైంది. తాజా భేటీతో దానికి ఇంకా బలమొస్తుంది.

ఇప్పటివరకు కేసీఆర్ కుటుంబానికి జైలు ఖాయమన్న తమ మాటలకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవటంతో తెలంగాణలో బీజేపీ నేతలకు గొంతులో వెలక్కాయ పడినట్టయ్యింది. కవిత అరెస్టు చేయకపోవటం కూడా తమ మీద ఆరోపణలు రావటానికి కారణంగా మారిందంటూ బీజేపీ నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజకీయం కోసం కాదు రాష్ఱ్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు మంత్రి కేటీఆర్ చెబుతున్నారు.

ఇదంతా పక్కన పెడితే… ఈ భేటీ తెలంగాణలో పుంజుకుంటున్న కాంగ్రెస్ కు మాత్రం మంచి అవకాశాన్ని ఇచ్చినట్టయ్యింది. ఈ భేటీ వల్ల కలుస్తున్న ఇరు పార్టీలకంటే కాంగ్రెస్ కే ఎక్కువ లాభం అంటున్నారు విశ్లేషకులు.