ముద్ర‌గ‌డ‌కు జ‌న‌సైనికుల మ‌నీ ఆర్డ‌ర్లు

ఆంధ్రా ప్రాంత సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ల్లో ఒక‌రైన ముద్ర‌గ‌డ పద్మ‌నాభంకు ఒక‌ప్పుడు కాపు యువ‌త‌లో మంచి క్రేజే ఉండేది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు.

కానీ 2019 ఎన్నిక‌ల ముంగిట‌ కాపుల‌కు రిజర్వేష‌న్లు ఇస్తామ‌న్న చంద్ర‌బాబును వ్య‌తిరేకిస్తూ.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ వెంట న‌డిచారు ముద్ర‌గ‌డ‌. కాపుల‌కు జ‌గ‌న్ న్యాయం చేస్తాడంటూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు కానీ.. గ‌త నాలుగేళ్ల‌లో ఆ వ‌ర్గానికి జ‌గ‌న్ చేసిందేమీ లేద‌నే అభిప్రాయం జ‌నాల్లో బ‌లంగా ఉంది.

నిధుల ద‌గ్గ‌ర్నుంచి అన్నింట్లోనూ అన్యాయం చేసిన జ‌గ‌న్ మీద వ్య‌తిరేక‌త పెరిగి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వైపు కాపు యువ‌త చూస్తున్న స‌మ‌యంలో.. ముద్ర‌గ‌డ ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తూ ఇటీవ‌ల రాసిన లేఖ పెద్ద దుమార‌మే రేపింది. ప‌వ‌న్‌ను నానా బూతులు తిట్టిన ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని వెన‌కేసుకొస్తూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర విమ‌ర్శ‌ల‌కే దారి తీశాయి.

వైసీపీకి ముద్ర‌గ‌డ అమ్ముడుపోయాడంటూ రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో కాపు యువ‌త ఆయ‌న తీరును తీవ్రంగా దుయ్య‌బ‌డుతోంది. అంత‌టితో ఆగ‌కుండా కాకినాడ రూర‌ల్ జ‌న‌సైనికులు చేప‌ట్టిన ఓ చ‌ర్య చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌తంలో కాపు ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్య‌మ కార్య‌క్ర‌మాల‌కు వ‌చ్చిన యువ‌త‌కు ద్వారంపూడినే ఉప్మా పెట్టించార‌ని.. వారి త‌ర‌లింపుకు లారీలు ఏర్పాటు చేశార‌ని ముద్రగ‌డ త‌న లేఖ‌లో పేర్కొన్న నేప‌థ్యంలో జ‌న‌సేన నేత పంతం నానాజీ.. తాము తిన్న ఉప్మాకు బ‌దులుగా వెయ్యి రూపాయలు ముద్ర‌గ‌డ‌కు మ‌నీయార్డ‌ర్ చేశారు. ఈ విష‌యం తెలిసిన జ‌న‌సైనికులు పెద్ద ఎత్తున అదే త‌ర‌హాలో ముద్ర‌గ‌డ‌కు మ‌నీయార్డ‌ర్ పంప‌డానికి క్యూ క‌ట్ట‌డం విశేషం.

ఈ వార్త వైర‌ల్ అయి.. మ‌రింత‌మంది జ‌న‌సైనికులు ముద్ర‌గ‌డ‌కు ఫోన్ పే ద్వారా డ‌బ్బులు పంపుతున్నార‌ట‌. ఈ డ‌బ్బులు తీసుకుని ద్వారంపూడికి ఇవ్వాల్సింది ఇచ్చి.. ఇక కాపుల జోలికి రావొద్ద‌ని వారు ముద్ర‌గ‌డ‌ను కోరుతుండం విశేషం.