ఎన్నికల ముందు జగన్ మాస్టర్ ప్లాన్

ఏపీలో కేబినెట్ విస్త‌రించ‌నున్నారా? ముహూర్తంకూడా రెడీ అయిందా? అంటే.. ఔన‌నే సంకేతాలు వ‌స్తు న్నాయి. తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి దీనికి సంబంధించిన ఆస‌క్తికర స‌మాచారం వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఇద్ద‌రి నుంచి ముగ్గ‌రు మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ ఉద్వాస‌న ప‌ల‌క‌నున్నార‌ని కూడా తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. వీరిలో ఒక‌రు మ‌హిళా మంత్రి కూడా ఉన్నార‌ని అంటున్నారు.

అదేవిధంగా తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌.. మ‌రో మంత్రి కూడా ఉన్నార‌ని వైసీపీసీనియ‌ర్ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. తాజాగా జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు రాక‌పోయినా.. మంత్రి వ‌ర్గం మార్పు, చేర్పులపై ఆయ‌న‌కు వివ‌రించేందుకు సీఎం జ‌గ‌న్ భేటీ అయ్యార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి.

మ‌రో 10 రోజుల్లో మంత్రి వ‌ర్గం మార్పు ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌న‌ను దృష్టిలో ఉంచుకుని .. ప్ర‌స్తుతం అసంతృప్తులుగా ఉన్న ఒక‌రిద్దిరిని మంత్రులుగా తీసుకునేందుకు జ‌గ‌న్ ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్టు తెలుస్తోంది. వీరిలో బాలినినే శ్రీనివాస‌రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో ఒక ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ మంత్రి, త‌ర‌చుగా రెడ్డి వ‌ర్గంపై విమ‌ర్శ‌లు చేస్తున్న ఆయ‌న‌ను కూడా త‌ప్పిస్తార‌ని తెలుస్తోంది.

ఇక‌, కొత్తగా మంత్రివ‌ర్గంలోకి తీసుకునేవారిలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు.. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి. మంగ‌ళ‌గిరిలో ఈ సారి మళ్లీ విజ‌యం ద‌క్కించుకునేందుకు ఆళ్ల‌ను మంత్రిని చేయాల‌నే డిమాండ్ వినిపిస్తోంది. పైగా ఆయ‌న‌కు గ‌తంలోనే జ‌గ‌న్ హామీ ఇచ్చి ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆళ్ల‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటార‌ని అంటున్నారు. అయితే.. ఇద్ద‌రు రెడ్డి నేత‌ల‌కు ఒకేసారి మంత్రి ప‌ద‌వులు ఇస్తారా? అనేది కూడా చ‌ర్చ‌గా మారింది. ఎలా చూసుకున్నా.. ఖ‌చ్చితంగా మంత్రి వ‌ర్గంలో మార్పులు ఉంటాయ‌నేది వాస్త‌వం అంటున్నారు సీనియ‌ర్లు. అందుకే గ‌వర్న‌ర్‌ను క‌లిశార‌ని చెబుతున్నారు.