దీనికి స‌మాధానం ఉందా.. సోము స‌ర్‌?!

Atchannaidu Kinjarapu

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు త‌ర‌చుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గ‌తంలో 50 రూపాయ‌ల‌కే చీప్ లిక్క‌ర్ అమ్ముతామ‌ని ప్ర‌క‌టించి ఇబ్బందుల్లో ప‌డ్డారు. త‌ర్వాత‌.. అమ‌రావ‌తిని తామే పూర్తి చేస్తామ‌న్నా రు. ఇది రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌ను తెచ్చి పెట్టింది. ఇక‌, ఇప్పుడు తాజాగా.. సీఎం జ‌గ‌న్‌ను టీడీపీ, జ‌న సేన‌లు విమ‌ర్శిస్తే.. ఆయ‌న రియాక్ట్ కావ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ ప‌రిస్థితి ఏకంగా.. రాజకీయ దుమారానికి కూడా దారితీసింది.

ఇదే విష‌యంపై టీడీపీ సోము వీర్రాజుపై తీవ్ర‌స్థాయిలో ఫైరైంది. సీఎం జ‌గ‌న్ అవినీతి అక్రమాలు, వైఫ ల్యాలను ప్రశ్నిస్తే సోము వీర్రాజుకు ఎందుకు కోపమని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వీర్రాజు ఒంగోలులో చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు ఫైర‌య్యారు. “రాష్ట్రాన్ని రావణ కాష్ఠంగా మార్చిన సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలని మేం కోరితే సోముకు అంత కోపం, అసహనం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు” అని అచ్చెన్న అన్నారు.

స‌రే.. టీడీపీ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఏపీలో అక్క‌మాలు, అవినీతి, దారుణాలు, నేరాలు, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆందోళన వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. అమిత్ షా.. విశాఖ‌ప‌ట్నంలోను, న‌డ్డా శ్రీకాల‌హ‌స్తిలోనూ.. జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. ఇదే ప‌నిని టీడీపీ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే గ‌వ‌ర్న‌ర్ న‌జీర్‌ను క‌లిసి.. వారు ఫిర్యాదు చేశారు.

మ‌రి ఈ విష‌యంపై సోము యాగీ చేయ‌డం ఎందుకు? అన్న‌ది విశ్లేష‌కుల ప్ర‌శ్న‌కూడా!. ఏ రాష్ట్రంలో అయినా.. పరిస్థితులు దిగజారితే కేంద్రం జోక్యం చేసుకోవడానికి రాజ్యాంగపరంగా అవకాశం ఉంది. నిజానికి ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీజేపీ.. ఇక్క‌డ వైసీపీపై పోరాడాల్సింది పోయి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అధికార పార్టీని, ప్రభుత్వాన్ని వెనకేసుకొని రావడం రాజ‌కీయంగా చిత్రంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి సోము ఎక్క‌డ ఏం వ్యాఖ్యానించినా.. వివాదాన్ని కొనితెచ్చుకున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండడం గ‌మ‌నార్హం.