పవన్ పోటీ చేసేది అక్కడేనా?

రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడినుండి పోటీచేస్తారనే విషయంలో క్లారిటి వచ్చినట్లేనా ? ఇప్పటివరకు అరడజను నియోజకవర్గాల్లో పవన్ పోటీచేస్తారంటు బాగా ప్రచారం జరుగుతోంది. అయితే వారాహి యాత్ర మొదలైన తర్వాత పవన్ వైఖరి కారణంగా కొంత క్లారిటి వచ్చిందని పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయేఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీచేయటానికి పవన్ రెడీ అవుతున్నారట. ఎందుకంటే వారాహి యాత్రలో పవన్ రెండురోజులు పిఠాపురంలోనే హాల్ట్ వేశారు.

ఇక్కడ మకాం వేయటమే కాకుండా పిఠాపురంలోనే పార్టీ ఆఫీసు ఓపెన్ చేస్తానని, ఇల్లు కూడా కట్టుకోబోతున్నట్లు చెప్పారు. పక్కనే ఉన్న కాకినాడలోను రాజమండ్రిలోను పార్టీ ఆఫీసులుండగా మళ్ళీ పిఠాపురంలో పార్టీ ఆఫీసు ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? పోనీ పార్టీ ఆఫీసు ఏర్పాటుచేసుకుంటే చేసుకోవచ్చని అనుకుందాం. మరి ఇల్లు కూడా ఇక్కడే కట్టుకుంటానని చెప్పటం ఏమిటి ? పార్టీ ఆఫీసుతో పాటు ఇల్లు కూడా కట్టుకోవటం అంటేనే పవన్ పిఠాపురంపై దృష్టిపెట్టారన్న విషయం అర్ధమవుతోంది.

ఇందులో భాగంగానే పోటీచేసే వాళ్ళు మనవాళ్ళా కాదా అని కులం కోణంలో కాకుండా మంచిచేసే కోణంలో మనవాడా కాదా అని చూసి ఓట్లేయమని పదేపదే అడుగుతున్నారు. పిఠాపురంలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడున్న సుమారు 2.5 లక్షల ఓట్లలో కాపుల ఓట్లు దాదాపు 75 వేలదాకా ఉన్నట్లు చెబుతున్నారు. బీసీలు, ఎస్సీలు, మిగిలిన సామాజికవర్గాల ఓట్లలో బీసీలు, ఎస్సీలు ఎక్కువగా ఉన్నాయట.

ఇక్కడనుండి పవన్ పోటీచేస్తే వైసీపీ తరపున బహుశా కాకినాడ ఎంపీ వంగా గీత పోటీచేసే అవకాశముందని అంటున్నారు. గత 2009లో ప్రజారాజ్యంపార్టీ తరపున ఎంఎల్ఏగా గెలిచారు. అప్పటినుండి ఏ పదవిలో ఉన్నా నియోజకవర్గంతో మంచి సంబంధాలనే మైన్ టేన్ చేస్తున్నారు. బంధువులు, సన్నిహితులు, మద్దతుదారులు కూడా గీతకు ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏ పెండెం దొరబాబుకు టికెట్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. కాబట్టి పవన్ పోటీ ఖాయమైతే వైసీపీ అభ్యర్ధి కూడా ఖాయమవుతారనే అనిపిస్తోంది. మరి చివరకు పవన్ ఏమిచేస్తారో చూడాల్సిందే.