ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు తాజా కామెంట్స్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత ఇలాకా కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలోని పలు సమస్యలను తెలుసుకొని ప్రజలతో మమేకమయ్యేందుకు చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. నీతినిజాయితీకి కుప్పం ప్రజలు మారుపేరని, కానీ, వైసీపీ పాలనలో ఇక్కడ రౌడీలు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు.

వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. సంపద సృష్టించడం, ఆ సంపదను పేదలకు పంచడం టీడీపీకి మాత్రమే తెలుసని చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా టీడీపీని గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ పెట్టినప్పటి నుంచి కుప్పంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉందని చంద్రబాబు అన్నారు. పేదలను ధనికులను చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని అన్నారు.

మహిళలు మహాశక్తిగా మారేందుకు మహాశక్తి పథకం తెచ్చామని, ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లతో పాటుగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని అన్నారు. 95 శాతం హంద్రీనీవా పనులుె తన హయాంలో పూర్తయ్యాయని, మిగిలిన ఐదు శాతం పనులను జగన్ చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. తానుంటే మూడేళ్లలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసేవాడిని చెప్పారు.

ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని చంద్రబాబు మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి టీడీపీని గెలిపించాలని, ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం పని చేయాలని, కార్యకర్తలను ప్రజలను ఆదుకునే బాధ్యత టీడీపీదేనని ఆయన అన్నారు. గత 30 ఏళ్లలో కుప్పంలో జరిగిన అభివృద్ధిని రాబోయే ఐదేళ్లలో చేసి చూపిస్తానని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.