ఎన్నిక‌ల ముంగిట‌.. కేసీఆర్ సుడిగాలి అభివృద్ధి!!

అదేంటి అనుకుంటున్నారా? ఔను నిజ‌మేన‌ని అంటున్నారు తెలంగాణ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు. ఎన్నిక‌ల‌కు మ‌రో ఐదు మాసాలే గ‌డువున్న నేప‌థ్యంలో ఇప్పుడు హుటాహుటిన సీఎం కేసీఆర్ ప‌దుల సంఖ్య‌లో ప‌నుల‌కు శంఖుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేస్తున్నారు. జిల్లాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. దీంతో ఇది సుడిగాలి అభివృద్ధి! అంటూ.. విప‌క్ష‌నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

తాజాగా సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అనేక ప్రాజెక్టుల‌కు(నిధులు ఉన్నాయో లేవో తెలియ‌దు) శంకుస్థాప‌న‌లు చేశారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు నూతన కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం మంచిర్యాల వేదికగానే బీసీ కులవృత్తులకు రూ.లక్ష సాయం, రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తొమ్మి దేళ్లలో తెలంగాణ దేశంలో చాలా రంగాల్లో నంబర్‌ వన్‌ స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

పరిపాలన సంస్కరణ అంటే పది ఆఫీసులు ఏర్పాటు చేసి.. నలుగురు ఆఫీసర్లను పెంచడం కాదని కేసీఆర్ అన్నారు. సంస్కరణ అనేది ఒక రోజుతో అంతం అయ్యేది కూడా కాదన్నారు. ఇది నిరంతర ప్రక్రియ. సంస్కరణలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంద‌న్నారు. అనేక విషయాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉంది. కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతలమైంది. దేశంలో నోట్ల రద్దు భయంకరమైన పరిస్థితి. సంక్షేమ పథకాల్లో అగ్రస్థానంలో ఉన్నాం. సంక్షేమ పథకాలను సమర్థంగా ప్రజలకు చేరవేస్తున్నాం. బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం. యాదవులకు గొర్రెల పంపిణీ విజయవంతంగా చేపట్టాం. 3.8 లక్షల మందికి రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తున్నాం అని కేసీఆర్ అన్నారు.

రాష్ట్రంలో కంటి వెలుగు పరీక్షలు స్ఫూర్తిగా నిలిచాయన్న కేసీఆర్ ధిల్లీ, పంజాబ్‌లో కూడా అక్క‌డి ప్ర‌భుత్వాలు కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తున్నాయ‌ని తెలిపారు. భారత్‌కు తెలంగాణ తలమానికంగా నిలవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. కొత్త రాష్ట్రం ఏర్పడే నాటికి ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రాబోతున్నాయని, పెద్ద సంఖ్యలో వాటిని ఏర్పాటు చేస్తామని అన్నారు. పామాయిల్‌కు దేశంలో గిరాకీ ఏర్పడుతోందన్న కేసీఆర్.. ఆ తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలన్నారు.

ఇవీ.. శంకుస్థాప‌న‌లు..

  • నస్పూర్‌లో 26.24 ఎకరాల విస్తీర్ణంలో రూ.41 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని, జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు.
  • గోదావరి నదిపై రూ. 164 కోట్లతో నిర్మించనున్న మంచిర్యాల అంతర్గాం రహదారి వంతెనకు శ్రీకారం చుట్టారు.
  • హాజీపూర్ మండలం గుడిపేటలో వైద్య కళాశాల, మందమర్రిలో రూ.500 కోట్ల వ్యయంతో ఫామ్ ఆయిల్ పరిశ్రమకు శంకుస్థాప‌న చేశారు.
  • కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ.1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.