ఏపీలో చీకట్లు.. కేసీఆర్ కు గట్టి కౌంటర్ పడాల్సిందేనట

ఎవరికి వారు వారి గొప్పల గురించి చెప్పుకోవటం తప్పేం కాదు. ఆ క్రమంలో ఎదుటోళ్ల మనసుల్ని గాయపరిచేలా.. చిన్నబుచ్చేలా మాట్లాడటంలో అర్థం లేదు. కాంగ్రెస్ అధినేత్రిగా వ్యవహరించిన సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన విభజన తీరులో ఏపీకి అన్యాయం.. తెలంగాణకు న్యాయం జరిగేలా చేయటం.. అదే విషయాన్ని పరోక్షంగా కేసీఆర్ తన మాటల్లో ప్రస్తావించటం తెలిసిందే.

వాస్తవానికి ఒక రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే.. రాష్ట్రం కోరుకున్న వారి ప్రయోజనాల కంటే కూడా ప్రాంతాన్ని కోల్పోతున్న రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మాత్రం రివర్సులో వ్యవహరించారనే టాక్ ఎక్కువగానే వచ్చింది. రాష్ట్రం కలిసి ఉండాలన్న పట్టుదలతో ఉద్యమం చేసిన ఆంధ్రోళ్లు.. విభజన వేళ.. తమకు కావాల్సిన డిమాండ్లను అడిగింది కూడా లేదు. ఎందుకంటే.. కలిసి ఉండాలన్నదే తమ ఆకాంక్ష తప్పించి.. విడిపోయే వేళ.. వాటాల్లో తమకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచన చేసింది లేదు.

ఒకవేళ అదే చేసి ఉంటే ఏపీకి మేలు చేసేందుకు సోనియా సైతం ఒప్పుకునేవారనటంలో సందేహం లేదు. విభజన వేళ ప్రకటించిన పలు నిర్ణయాల్ని చూసినప్పుడు.. పలువురు ముక్కున వేలేసుకున్న పరిస్థితి. విభజనతో జరిగే నష్టానికి పరిహారం అంతంత మాత్రంగా ప్రకటించటమేకాదు.. విభజన కారణంగా చోటు చేసుకునే నష్టాలకు తగిన మూల్యాన్ని ఇచ్చింది లేదు. ఈకారణంగానే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మిగులుతో మొదలైతే.. ఏపీ మాత్రం అందుకు భిన్నంగా దారుణమైన లోటులోకి వెళ్లిన పరిస్థితి.

గడిచిన తొమ్మిదేళ్లుగా.. కిందామీదా పడుతున్న ఏపీ.. ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకుంది. తెలంగాణకు పాడికుండ లాంటి హైదరాబాద్ ను ఇవ్వటంతో ఆ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా పోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన ప్రసంగాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీని చిన్నబుచ్చేలా మాట్లాడటం ఎక్కువైంది. తాజాగా నాగర్ కర్నూలులో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్.. ఎస్సీ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

“తెలంగాణ వస్తే ఈ ప్రాంతం కారుచీకటి అవుతుంది. మీకు కరెంటు రాదని శాపాలు పెట్టారు. తెలంగాణ నేడు 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో ధగధగా మెరిసిపోతోంది. అదే ఆంధ్రాలో చిమ్మచీకటి అలుముకుంది. ఏపీ సహా దేశంలో మరే రాష్ట్రంలోనూ 24 గంటలు విద్యుత్ ఇచ్చే దిక్కు లేదు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే వ్యవస్థ ఎక్కడా లేనేలేదు” అని వ్యాఖ్యానించారు.
ఇంత మంచి సంక్షేమాన్ని ఇస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టుకోవద్దన్న సూచనను ప్రజలకు చేయటం గమనార్హం.

తమ పాలన గొప్పల గురించి చెప్పుకోవాలన్నదే కేసీఆర్ లక్ష్యమైతే.. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ.. అందుకు భిన్నంగా తరచూ ఏపీ ప్రస్తావన తీసుకొచ్చి.. మాటలతో మనసులు గాయపడేలా మాట్లాడటంలో అర్థం లేదు. నిజంగానే కేసీఆర్ చెప్పినట్లుగా ఏపీలో చీకట్లలో ఉందా? అన్నది ప్రశ్న. లేనిదానిని తన గొప్పకోసం మాట్లాడే మాటల్నిఖండించాల్సిన అవసరం ఉంది. ఘాటు కౌంటర్ తో సమాధానం చెబుతూ.. మళ్లీ మాట్లాడకుండా చేయాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. జగన్ సర్కారు అందుకు సిద్ధమవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.