ఒడిశా రైలు ప్రమాదం: 101 మృతదేహాలను దాచేందుకు భారీ ప్లానింగ్

ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంబంధించిన సవాళ్లు ఇప్పుడు కొత్త సమస్యల్ని తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 175 మంది మరణిస్తే.. దుర్ఘటన జరిగి ఐదు రోజులు అవుతున్నా.. ఇప్పటికి ఆచూకీ తెలియని మృతుల సంఖ్య 101గా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ 101 మృతదేహాలను ప్రస్తుతం స్థానిక ఎయిమ్స్ ప్రాంగణంలో ఉంచారు. అయితే.. ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచే సౌకర్యం లేకపోవటంతో 101 మృతదేహాలను భద్రపర్చటం పెద్ద సమస్యగా మారింది.

దీనికి పరిష్కారంగా పారాదీప్ పోర్టు వర్గాలతో సంప్రదింపులు జరిపి.. మూడు భారీ కంటైనర్లను తెప్పిస్తున్నారు. ఒక్కో కంటైనర్ లో 40-50 వరకు 101 మృతదేహాలను భద్రపరిచే వీలుందని చెబుతున్నారు. ఈ భారీ కంటైనర్లలో ఉన్న ప్రత్యేక వసతుల కారణంగా డెడ్ బాడీలు చెడిపోకుండా దాదాపు 2 నెలల పాటు ఉంటాయని భావిస్తున్నారు. మరణించిన వారిని గుర్తించేందుకు వీలుగా ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. మరణించిన వారిలో అత్యధికులు కార్మికులు ఉండటంతో.. వారికి సంబంధించిన గుర్తింపు కార్డులు వారి వెంట లేకపోవటంతో వారి ఆచూకీని గుర్తించటం కష్టంగా మారింది.

మరో విషాదకరమైన అంశం ఏమంటే.. మరణించిన వారిని తమ బంధువులుగా ఇద్దరు.. ముగ్గురు క్లెయిం చేయటంతో విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. ముఖాలు నలిగిపోయి ఉండటంతో.. గుర్తించే విషయంలో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. డెడ్ బాడీలు మారకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మృతదేహాలను కుటుంబీకులకు ఇచ్చే వేళలో.. డీఎన్ఏ పరీక్ష జరిపి ఇవ్వాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు. గుర్తించిన మృతులను ప్రభుత్వ ఖర్చులతో వారి ఇళ్లకు చేరుస్తున్నారు. మరణ ధ్రువీకరణ పత్రాలను పోస్టు ద్వారా పంపుతారని చెబుతున్నారు.