రాహుల్ ఈ రేంజ్‌లో మోడీని ఏకేస్తార‌ని అనుకోలేద‌ట‌!

Rahul Gandhi
Rahul Gandhi

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని  కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ త‌ర‌చుగా విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ విమ‌ర్శ‌ల‌కు.. బీజేపీ నుంచి కూడా అదే రేంజ్‌లో కౌంట‌ర్లు ప‌డుతున్నాయి. కానీ… తాజాగా అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాహుల్‌గాంధీ మోడీపై ఓ రేంజ్‌లో ఎక్కేశారు. ఓ స్థాయిలో ఏకేశారు. దీంతో బీజేపీ నాయ‌కులు కిమ్మ‌న‌కుండా.. మౌనంగా ఉండిపోయారు.

మ‌రి మోడీని రాహుల్ ఏమ‌న్నారంటే.. గత ప్ర‌భుత్వంలో వైఫల్యాలపై ఒకరిని నిందించడమే కానీ.. భవిష్యత్‌ గురించి ఎప్పుడూ మాట్లాడే అల‌వాటు మోడీకి లేద‌ని  రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. న్యూయార్క్‌లోని జవిట్స్ సెంటర్‌లో భారత సంతతి ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు.

భవిష్యత్‌ గురించి ఆలోచించే సామర్థ్యం బీజేపీకి, ఆర్ఎస్ఎస్ లేవని రాహుల్‌ ఎద్దేవా చేశారు. అద్దంలో చూసి కారు నడుపుతూ ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగే పరిస్థితుల్లో.. ప్రధాని మోడీ, బీజేపీ ఉన్నాయని విమర్శించారు. ద్వేషాన్ని ద్వేషంతో తెంచలేమన్న రాహుల్‌.. ప్రేమతో మాత్రమే నివారించగలమని చెప్పారు.

“రైలు ప్రమాదం ఎందుకు జరిగిందంటే కాంగ్రెస్‌ 50 ఏళ్ల క్రితం నిర్మించిందని అంటారు. పుస్తకాల నుంచి పీరియాడిక్ టేబుల్, పరిణామ సిద్దాంతం ఎందుకు తొలిగించారంటే కాంగ్రెస్‌ 60 ఏళ్ల క్రితం పెట్టింది కాబట్టి అంటారు.  మంత్రులు, ప్రధాని మాటలు వింటే వారు భవిష్యత్‌ గురించి మాట్లాడటంలేదని మీరు గుర్తిస్తారు. వారు గతం గురించే మాట్లాడతారు. గతానికి సంబంధించి ఒకరిని నిందిస్తారు.” అని అన్నారు.

 కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగితే బ్రిటిష్ వారి వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఒక రైలు ప్ర‌మాదానికి సంబంధించి కాంగ్రెస్ మంత్రి ఇది నా బాధ్యత కాబట్టి నేను రాజీనామా చేస్తానని చెప్పారన్న విష‌యాన్ని రాహుల్ గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే మన దేశంలో ఉన్న సమస్య  అని రాహుల్ చెప్పుకొచ్చారు. వాస్త‌వానికి.. రాహుల్ ఎక్క‌డ ఎప్పుడు ఏం మాట్లాడినా.. వెంట‌నే రియాక్ట్ అయ్యే బీజేపీ నాయ‌కులు ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోయారు.