శివకుమార్ రూట్లో షర్మిల పొత్తులు ?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల పార్టీ పెట్టి రెండు సంవత్సరాలు కావొస్తోంది. ఆమె నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా పూర్తి చేసుకున్నారు. ఐనా పార్టీకి జోష్ వచ్చినట్లు కనిపించడం లేదు. ఒక ఉప ఎన్నికలో కూడా పోటీ చేసే ధైర్యం ఆ పార్టీకి లేదనే చెప్పాలి. సీఎం కేసీఆర్ మీద, వేరే పార్టీల మీద దుమ్మెత్తిపోయడం తప్ప ఇంతకాలం షర్మిల చేసిందేమీ లేదు. ధర్నాలు, రోడ్డుపై బైఠాయించడాలకు మాత్రం తక్కువేమీ లేదు.

శివకుమార్ తో భేటీ

తెలంగాణలో తన పార్టీ మనుగడ సాధించడం అంత సులభం కాదని షర్మిల గుర్తించినట్లున్నారు. ఒంటరిపోరు వల్ల డిపాజిట్లు కూడా దక్కవన్న నిర్థారణకు వచ్చినట్లున్నారు. ఇప్పుడామె పొత్తులపై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దిశగానే కర్ణాటక తాజా డిప్యూటీ సీఎం శివకుమార్ తో ఆమె వరుసగా రెండు సార్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్, వైఎస్సార్టీపీ పొత్తు దిశగా సంకేతాలిచ్చేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మర్యాద పూర్వకంగా కలిసినట్లు, శివకుమార్ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు చెబుతున్నప్పటికీ అసలు విషయం మాత్రం పొత్తుల చుట్టూ తిరుగుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు

షర్మిల వ్యవహారంపై తెలంగాణలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆమె ఆంధ్రావాలా అని ఏమైనా రాజకీయాలు చేసుకోవాలంటే అక్కడ చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. దీనిపై రేవంత్, షర్మిల మధ్య మాటకు మాట యుద్ధం కూడా జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం షర్మిల – శివకుమార్ మీటింగును ఆహ్వానిస్తున్నారు. అది శుభ పరిణామమమని,లౌకిక శక్తుల మధ్య మైత్రీ బంధం అవివార్యమని విశ్లేషిస్తున్నారు. దీనితో కాంగ్రెస్, వైఎస్సార్టీపీ మధ్య ఎన్నికల పొత్తుకు బెంగళూరులో బీజం పడిందన్న చర్చ మొదలైంది..

ఆంధ్రప్రదేశ్ మాటేమిటి..

తెలంగాణ ఎన్నికల తర్వాత షర్మిల, ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెడతారని కూడా మీడియా వార్తలు వస్తున్నాయి. అక్కడి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తూ జగన్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో ఉంటారని అంటున్నారు. 2024లో ఏం జరుగుతుందో చూడాలి..