కాంగ్రెస్ టార్గెట్ @150

కర్నాటక ఎన్నికల్లో సాధించిన ఘనవిజయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతులేని ఆత్మవిశ్వాన్ని నింపినట్లే ఉంది. అందుకనే ఈ ఏడాది చివరలో జరగబోతున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాదించాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. మధ్యప్రదేశ్ లోని 230 సీట్లలో కాంగ్రెస్ 150 గెలుచుకుంటుందని అగ్రనేత రాహుల్ గాంధి చెప్పారు. ఇపుడు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కు 96 సీట్లుంది. నిజానికి 2018 ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీయే. కాకపోతే ముఖ్యమంత్రి పీఠం కోసం నేతల మధ్య జరిగిన గొడవలో ప్రభుత్వాన్ని తనంతట తానుగానే కూల్చేసుకున్నది.

ముఖ్యమంత్రి పోస్టుకోసం జ్యోతిరాధిత్య సింథియా పోరాడి లాభంలేదని తెలుసుకుని తన మద్దతుదారులతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పటంతో అధికారం కుప్పకూలిపోయింది. ఎప్పుడైతే 27 మంది మద్దతుదారులతో సింథియా కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి చేతులు కలిపారో వెంటనే ప్రతిపక్షంలో ఉన్న  బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. తాను సీఎం కాలేకపోయినా కమలనాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సింథియా కూల్చగలిగారు.

సరే చరిత్రను వదిలేస్తే తొందరలో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమనే హస్తంపార్టీ నేతలు అనుకుంటున్నారు. టికెట్ల కేటాయింపు, ప్రచారం, సంక్షేమపథకాల విషయంలో ఇవ్వాల్సిన హామీలపై కర్నాటకలో అమలుచేసిన ఫార్ములానే మధ్యప్రదేశ్ లో కూడా ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్డున ఖర్గే అధ్యక్షతన రాహుల్, మాజీ ముఖ్యమంత్రులు కమలనాధ్, దిగ్విజయ్ సింగ్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు రాష్ట్రంలోని కీలక నేతలు సమావేశమయ్యారు.

నరేంద్రమోడీ పరిపాలన దేశానికి ఏ విధంగా ప్రమాదకరమో జనాలందరికీ వివరించాలని సమావేశంలో తీర్మానంచేశారు. అభ్యర్ధుల ప్రకటన కూడా ముందుగానే జరిగిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రచారంలో అగ్రనేతలంతా కలిసికట్టుగా ఉండాలని, చేసే ప్రచారం, ఇచ్చేహామీలు గ్రామీణప్రాంతాల్లోని చివరి జనాలకు కూడా చేరాలన్నది కీలకమైన పాయింట్. మోడీ పాలన మీద దేశవ్యాప్తంగా మొదలైన వ్యతిరేకతను ఎంత వీలైతే అంత అడ్వాంటేజ్ తీసుకోవాలన్నది ప్రధానమైన టార్గెట్ గా పెట్టుకున్నారు. అన్నీ పరిస్ధితులను భేరీజు వేసుకున్నారకే కాంగ్రెస్ కు 150 సీట్లు వస్తాయని రాహుల్ ఫిక్సయ్యారు.