రాజగోపాల్ రెడ్డిపై ఈసారి వేటు తప్పదా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇస్తానని వాగ్దానం చేసిన కాంగ్రెస్ హైకమాండ్ మాట తప్పిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డిపై కూడా రాజగోపాల్ రెడ్డి పలుమార్లు విమర్శలు గుప్పించారు.

అయినా సరే రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అయితే, తాజాగా రాహుల్ గాంధీ నాయకత్వంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని, బయట నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల నిజమైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు సంచలనం రేపాయి.

ఈ క్రమంలోనే తాజాగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో గీత దాటితే వేటు తప్పదని రాజగోపాల్ రెడ్డికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయినా…ఇంకొక నేత అయినా…గీత దాటితే అంతా ఒక్కటేనని హెచ్చరించారు.

అంతేకాదు, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఇక, పార్టీలో పదవులపై కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని, ఎవరి హద్దుల్లో వారు ఉంటే మంచిదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హితవు పలికారు.

అంతకుముందు, తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడూ విమర్శించలేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఆధిపత్యం చలాయిస్తున్నారంటూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు, కాంగ్రెస్ సీనియర్ నేతలకు తగిన గౌరవం కల్పించాలని అన్నారు. సీమాంధ్ర నాయకులు, మీడియా చెప్పుచేతల్లో ప్రభుత్వం ఉండకూదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పని చేయకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు.