మ‌రింత కాక రేపిన పొంగులేటి-జూప‌ల్లి రాజ‌కీయం..

తెలంగాణ రాజ‌కీయాల్లో కొన్ని రోజులుగా ఆస‌క్తిగా మారిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  వ్య‌వ‌హారం.. రోజుకో మ‌లుపు తిరుగుతోంది. వారిద్ద‌రూ ఏ పార్టీలో చేరుతారనే విషయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్‌ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురై.. ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన ఈ నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.  ఈ విషయంలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఇప్ప‌టికే ఆహ్వానాలు ప‌లికారు. అయితే.. మ‌రో నాలుగు అడుగులు ముందుకు వేసిన బీజేపీ నేత‌లు ఏకంగా వారితో మంత‌నాలు కూడా సాగిస్తున్నారు.

ఈ క్రమంలో పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరికపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవ‌ల ఈయ‌న ర‌హ‌స్యంగా వారిద్దరితోనూ.. హైద‌రాబాద్ శివారులో చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. ఆ చ‌ర్చ‌ల్లో ఏం జ‌రిగింద‌నేది అప్పుడు చెప్ప‌క‌పోయినా.. తాజాగా కొన్ని విష‌యాలు వెల్ల‌డించారు. ఇప్పటి వరకు చర్చలు జరిపి పొంగులేటి, జూపల్లి ఇతర పార్టీల్లో చేరకుండా ఆపగలిగానని ఈటల రాజేందర్‌ తెలిపారు. అయినా, వారిద్దరూ బీజేపీలో చేరతారని కచ్చితంగా చెప్పలేమని అన్నారు.

ప్రతి రోజు వాళ్లతో మాట్లాడుతున్నానని.. అయితే బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఈట‌ల తెలిపారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు పట్టుందని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రియాంక గాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి తాను పొంగులేటితో చర్చించాననని తెలిపారు.

కొంతమంది తను అనని వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్త ం చేస్తున్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌ను అవలీలగా మింగేస్తారని.. సీఎంకు ట్రిక్స్‌ బాగా తెలుసని అన్నారు. కాగా ఈటల తాజా వ్యాఖ్యలతో పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో వీరిద్ద‌రి రాజ‌కీయాలు మ‌రింత కాక‌రేపుతున్నాయి.