ఏపీలో మారుతున్న పొలిటిక‌ల్ ప‌వ‌నాలు..

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలోనే ఏపీలో కేబినెట్ భేటీకి రంగం రెడీ అయింది. జూన్ 7వ తేదీన ఈ భేటీ నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మైంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు. గ‌త రెండు రోజుల కింద‌ట సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. తొలిరోజు నీతిఆయోగ్ భేటీలో పాల్గొన్నారు. అనంత‌రం.. పార్ల‌మెంటు నూత‌న భ‌వ‌నం వేడుక‌లో పాల్గొన్నారు. మూడోరోజు సోమ‌వారం షెడ్యూల్‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు.

ఇదిలావుంటే, ఈ ప‌ర్య‌ట‌న‌లో పైకి చెప్ప‌కుండా..కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో జ‌గ‌న్ భేటీ అయ్యారు. సుమారు 40 నిమి షాలు ఆదివారం రాత్రి 10 గంట‌ల త‌ర్వాత భేటీ అయి చ‌ర్చించారు. ఈ స‌మ‌యంలో పోల‌వ‌రం, క‌డ‌ప ఉక్కు, తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు వంటివాటిపై చ‌ర్చించామ‌ని.. ప్ర‌భుత్వం పేర్కొంది. కానీ, దీనికోస‌మే అయితే.. అర్ధ‌రాత్రి వేళ జ‌గ‌న్ నేరుగా షాను కలుసుకుంటారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కువెళ్లాల‌నే వ్యూహంతోనే జ‌గ‌న్ ఇలా.. వ్య‌వ‌హ‌రించి ఉంటార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

అందుకే ఆయ‌న ఢిల్లీలో  ఉన్న స‌మ‌యంలోనే కేబినెట్ భేటీకి రంగం రెడీకావ‌డం.. స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఉన్న వేడిలోనే ఎన్నిక‌ల‌కు వెళ్లిపోతే.. వైసీపీ మ‌ళ్లీ గెలుస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు కూడా కొన్నాళ్లుగా చెబుతు న్నాయి. ఇదిలావుంటే.. ఇప్పుడు పొత్తుల విష‌యం కూడా తేల‌క‌పోవ‌డంతో ప్ర‌తిప‌క్షాలు కూడా వేటిక‌వే ప‌నిచేసుకుంటు న్నాయి. ఈ స‌మ‌యంలో హ‌ఠాత్తుగా ఎన్నిక‌ల‌కు వెళ్తే.. పొత్తుల విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకుని వెళ్లి.. వారిని మాన‌సికంగా రెడీ చేసేందుకు ప్ర‌తిప‌క్షాల‌కు చాలా స‌మ‌యం ప‌డుతుంది.

అంత టైం ఇవ్వ‌కుండా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా విప‌క్షాల‌పై పైచేయి సాధించాల‌నేది సీఎం జ‌గ‌న్ వ్యూహంగా ఉంద‌ని.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కావ‌డం.. ఆ వెంట‌నే ఏపీలో కేబినెట్ భేటీ అంటూ.. ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. కేబినెట్ భేటీ అనంత‌రం అసెంబ్లీ పెట్టేసి.. త‌ర్వాత‌.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.