టీడీపీ అదిరిపోయే ఎన్నిక‌ల మేనిఫెస్టో

మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లో వేస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. యువత కోసం యువగళం కార్యక్రమం ప్రకటించారు. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. రైతుల కోసం ‘అన్నదాత’ కార్యక్రమం తెస్తామని చంద్రబాబు తెలిపారు.

మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంతో మిని మ్యానిఫెస్ట్ ని విడుదల చేశారు. ఇప్పటికే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకేళ్లారు. వీటికి బలం చేకూర్చే విధంగా ఇప్పుడు మిని మ్యానిఫెస్టోని తీసుకుని వచ్చారు. దీనిలో నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు పెద్దపీఠ వేశారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా ఈ మ్యానిఫెస్టోలో స్థానం కల్పించారు.

మహిళ ‘మహా’ శక్తి…
ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మ‌హిళ మహా శక్తి పేరుతో పథకాన్ని తీసుకుని వస్తామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపడుచులకి “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. దీనితో పాటే ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందించేలా తెలుగుదేశం హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణియించారు.

ఉచిత బ‌స్సు ప్ర‌యాణం
“ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం.

పూర్ టూ రిచ్
మినీ మ్యానిఫెస్ట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు రిచ్ టూ పూర్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం తో పేదలను సంపన్నులను చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడగు వేయనుంది. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా టీడీపీ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

బీసీలకు రక్షణ చట్టం
వైఎస్సార్సీపీ హయాంలో 26 మందికి పైగా బీసీలు హత్యకు గురైయ్యారు. 650 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. రాష్ట్రంలో 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయి. వీటిలో దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తోంది. వారికి అన్ని విధాలా అండగా నిలిచేలా ఈ చట్టాన్ని తీసుకుని వస్తోంది.

ఇంటింటికీ మంచి నీరు..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది.

అన్నదాత
రాష్ట్రంలో అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం ఒకే విడతలో అందించాలని తెలుగుదేశం నిర్ణయించింది.

యువగళం
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు 3000 రూపాయలను తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఇస్తుంది.