కొత్త పార్ల‌మెంటు… `శ‌వ‌పేటిక‌`.. దారి త‌ప్పిన ప్ర‌తిప‌క్షం విమర్శ‌లు!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని విమ‌ర్శిస్తూ..కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వాన్ని బ‌హిష్క‌రించిన ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు కొన్ని వ‌ర్గాల నుంచిమ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అదేస‌మ‌యంలో మేధావి వ‌ర్గాల నుంచి మాత్రం కొంత మ‌ద్ద‌తు త‌గ్గింది. ఇప్ప‌టికే 58 మంది మేధావులు.. ఉన్న‌త విద్యావంతులు.. ప్ర‌తిప‌క్షాల వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆయా పార్టీల‌కు లేఖ‌లు సంధించారు. ఇదిలావుంటే.. ఇప్పుడు పార్ల‌మెంటు అయితే.. ప్రారంభం అయిపోయింది. రాష్ట్రప‌తి చేతుల మీదుగా కాకుండా.  ప్ర‌ధాని దీనిని ప్రారంభించారు.

అయితే..ఇప్పుడు ప్ర‌తిప‌క్షాలపై  విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. ప్ర‌తిప‌క్షాల్లో ప్ర‌తిప‌క్షాలే.. విమ‌ర్శ లు చేసుకుంటున్నాయి. దీంతో మోడీపై యుద్ధం.. దారి త‌ప్పింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. బీహార్ అధికార పార్టీ ఆర్జేడీ.. కొత్త పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చింది.  ఓ శవపేటిక, నూతన పార్లమెంటు భవనం చిత్రాలను పక్కపక్కనే పెట్టి, ‘ఇదేమిటి?’ అని ప్రశ్నించింది.

దీనిపై ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ మాట్లాడుతూ, తమ పార్టీ ఇచ్చిన ట్వీట్‌లో శవపేటిక ఉందని, ప్రజాస్వామ్యం సమాధి అవుతోందని చెప్పడమే దీని వెనుక ఉద్దేశమని చెప్పారు. దీనిపై బిహార్ బీజేపీ నేత సుశీల్ మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నూతన పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చినవారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలన్నారు.

 మ‌రోవైపు  ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(మోడీని వ్య‌తిరేకించే ప‌క్షంలో ఉన్నారు) కూడా శ‌వ‌పేటిక‌తో పోల్చ‌డాన్ని తప్పుపట్టారు. బీహార్‌కు సంబంధించిన పార్టీ ఈ కోణంలో పోలిక తీసుకురావడం సరికాదని అన్నారు. అయితే, పార్లమెంటు భవనాన్ని నరేంద్ర మోడీ కాకుండా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ప్రారంభించి ఉంటే మెరుగ్గా ఉండేదని ఒవైసీ అభిప్రాయపడ్డారు.

“ఆర్జేడీ పార్లమెంటును శవపేటికతో ఆర్జేడీ ఎందుకు పోల్చింది? ఇంకేదైనా మాట్లాడి ఉండొచ్చు. ఈ కోణంలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది?” అని ఒవైసీ  అన్నారు. అన్నీ తానే చేయగలనని, ఇంకెవరి వల్లా కాదని చాటుకోవాలని ప్రధాని కోరుకుంటున్నారని, వ్యక్తిగత ప్రమోషన్ కోసం ప్రధాని ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నారని ఒవైసీ నిశిత విమర్శ చేశారు.