మోడీకి భారీ షాక్‌: భేటీకి 9 మంది సీఎంలు బై!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై కారాలు మిరియాలు నూరుతున్న ముఖ్య‌మంత్రుల జాబితా పెరుగుతోంది. సార్వ‌త్రిక ఎన్నికల స‌మ‌రానికి స‌మ‌యం చేరువ అవుతుండ‌డం.. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను పురుగొల్పుతూ.. త‌మ త‌మ రాష్ట్రాల‌పై దాడులు చేయిస్తున్నార‌నే విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రుల‌కు.. ప్ర‌ధాని మోడీ పొడ అంటేనే గిట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలో తాజాగా నిర్వ‌హించిన అత్యంత కీల‌క‌మైన నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ బాడీ స‌మావేశానికి ఆయా ముఖ్య‌మంత్రులు డుమ్మా కొట్టారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పైకి చూసేందుకున‌లుగురైదుగురే క‌నిపించినా.. ఈ రోజు లెక్క‌తేలిపోయింది.

ఏకంగా 9 మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీ నేతృత్వంలో సాగిన నీతి ఆయోగ్ భేటీకి దూరంగా ఉన్నారు. వీరిలో ప‌శ్చిమ బెంగాల్‌, తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా ఉండ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి నీతి ఆయోగ్‌ పాలక మండలిలో సభ్యులుగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులకు కేంద్రం నుంచి ఆహ్వానాలు అందాయి. ఏపీ నుంచి సీఎం జ‌గ‌న్, ఒడిసా నుంచి ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ వంటివారు హాజ‌రు కాగా ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాలు స‌హా.. ఉత్త‌రభారతంలోని రాష్ట్రాల‌కు చెందిన సీఎంలుకూడా షాక్ ఇచ్చారు.

తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ సీఎంలు ప్ర‌ధాని మోడీతో భేటీకి హాజ‌రు కాకుండా.. ఆయ‌న‌కు భారీ షాక్ ఇచ్చారు. అయితే.. మోడీతో విభేదిస్తున్న సీఎంల‌కు ఒక్కొక్క‌రికి ఒక్కొక్క స‌మ‌స్య క‌నిపిస్తున్నా.. అంతిమంగా ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్రేరేపించి..త‌మ‌పై దాడులు చేయిస్తున్నార‌నే ఆందోళ‌న మాత్రం అంద‌రిలోనూ ఉంది.

కార‌ణాలు ఇవీ..
+ ఢిల్లీ ప్ర‌భుత్వానికి శాంతి భ‌ద్ర‌త‌లు మిన‌హా అన్ని అదికారాలు ఉన్నాయ‌ని సుప్రీంకోర్టు చెప్పినా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువ‌చ్చింది. ఇప్ప‌టికే లిక్క‌ర్ స్కాం ద‌ర్యాప్తుపై ఆగ్ర‌హంతో ఉన్న కేజ్రీవాల్ ప్ర‌భుత్వం మోడీ భేటీకి దూరంగా ఉంది.
+ ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వాన్ని శార‌దా చిట్‌ఫండ్ స్కాం వెంటాడుతోంది. సీబీఐ దీనిని విడిచి పెట్ట‌డం లేదు. ఇటీవ‌ల సీఎం మ‌మ‌త మేన‌ల్లుడిని విచారించింది. దీంతో ఆమె దూరంగా ఉన్నారు.
+ మోడీకి వ్య‌తిరేకంగా కూట‌మి ప్ర‌య‌త్నాల్లో ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా తాజా భేటీని వ‌దులుకున్నారు.
+ తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడాదిన్న‌ర‌గా కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న దూరంగా ఉన్నారు.  
+ నిధుల కేటాయింపు విషయంలో పంజాబ్‌పై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ దూరంగా ఉన్నారు.
+ అనారోగ్య కారణాల రీత్యా నీతి ఆయోగ్‌ సమావేశానికి రావట్లేదని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్  ప్రకటించారు.
+ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్  సింగపూర్‌, జపాన్‌ పర్యటనలో ఉండ‌డంతో ఆయ‌న డుమ్మా కొట్టారు.  
+ కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ ఉందంటూ కొత్త‌ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బై చెప్పారు.
+ `ది కేరళ స్టోరీ` సినిమా నేప‌థ్యంలో ఏర్ప‌డిన గ్యాప్‌తో కేరళ సీఎం పినరయి విజయన్  కూడా భేటీకి దూరంగా ఉన్నారు.