హ్యాండిచ్చిన కేసీఆర్ !

కేసీఆర్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఎవరూ ఊహించలేరు. ఇపుడిదంతా ఎందుకంటే గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర ఆఫీస్ ఓపెనైంది. ఈ కార్యక్రమానికి కేసీయార్ హాజరుకాలేదు. కేసీయార్ కాదుకదా చివరకు పార్టీలోని తెలంగాణా నేతలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా హాజరుకాలేదు. రెండు రోజులు ముందు వరకు కూడా ఆఫీసు ఓపెనింగ్ కు కేసీయార్ వస్తారని విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే చివరికి ఏమైందో ఏమో కేసీయార్ మాత్రం అడ్రస్ లేకుండాపోయారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తెలంగాణాలోని వివిధ జిల్లాల్లో ప్రారంభమవుతున్న పార్టీ ఆఫీసులకు కూడా స్వయంగా కేసీయార్ హాజరవుతున్నారు. అలాంటిది ఇంత ఇంపార్టెంట్ అయిన ఏపీలో రాష్ట్ర పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కు హాజరు కాకపోవటం ఏమిటో అర్ధం కావటం లేదు. తెలంగాణాకు పొరుగునే ఉన్న మహారాష్ట్ర మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. రెగ్యులర్ గా మహారాష్ట్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే నాందేడ్ లో కేసీయార్ రెండురోజులు క్యాంపేశారు.

తెలంగాణా కాకుండా మహారాష్ట్ర, ఏపీ, ఒడిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ ఆఫీసులు తెరవాలని పై రాష్ట్రాల్లోని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. అయితే ఈమధ్యనే జరిగిన కర్నాటక ఎన్నికలవైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. దీనికి కారణం ఏమిటో ఎవరికీ తెలీదు. ఇదే సందర్భంలో మహారాష్ట్ర మీద బాగా దృష్టిపెట్టడంతో పాటు ఏపీ విషయాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేట్లుగా మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులు ఏదో ఒకటి మాట్లాడుతునే ఉన్నారు.

ఇదంతా చూసిన తర్వాత ఏపీలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ అన్ని అస్త్రాలు రెడీచేసుకుంటోందని అందరు అనుకున్నారు. ఇలాంటి సమయంలో గుంటూరు పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కు కేసీయార్ ఎందుకు హాజరుకాలేదో తెలీటంలేదు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించటం కేసీయార్ జోరుకు బ్రేకులు వేసిందని అర్ధమవుతోంది. అయితే అది పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కు అడ్డమైతేకాదు. ఇదే సమయంలో బీఆర్ఎస్ లో చెప్పుకోదగ్గ నేతలు కూడా ఎవరూ చేరలేదు. అందుకనే సింపుల్ గా పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తోనే పనికానిచ్చేసుంటారు.